అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కొత్త ఎత్తులకు తెర లేపింది. 2019 ఎన్నికల సమయంలోనే స్పష్టమైన హామీ ఇచ్చి ఇప్పటి వరకు పసుపు బోర్డు ఊసెత్తని బీజేపీ.. ఇప్పుడు కొత్తరాగం ఎత్తుకోవడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని వాదించిన వారే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంపై రైతులు మండిపడుతున్నారు. పాలమూరులో ఆదివారం జరిగిన సభలో మోదీ చేసిన ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని చెప్పిన వారే అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కేనని కొట్టి పారేస్తున్నారు. ఏదేమైనా పసుపు బోర్డు ప్రకటన ప్రధాని నోట రావడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన నిర్విరామ కృషి కారణమని రైతులు అంటున్నారు. ఎంపీగా ఉన్న సమయంలో కవిత చేసిన పోరాటంతోనే ఈ అంశం జాతీయస్థాయిలో చర్చకు దారి తీసిందని వారంతా చెబుతున్నారు.
-నిజామాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ)
నిజామాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి), అక్టోబర్ 1 : అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో బీజేపీ ప్రజలను మభ్యపెట్టేందుకు మరో తంతుకు తెరలేపింది. ఇన్ని రోజులపాటు పసుపుబోర్డు ఏర్పాటు అవసరం లేదంటూ వాదించిన పార్టీ పెద్దలే ఇప్పుడు తెలంగాణలో ఓడిపోతామనే భయంతో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించడంపై రైతులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 2019లో ఇదే మాటిచ్చి, ఇన్నిరోజులుగా తప్పించుకొని తిరుగుతున్న బీజేపీని ఇప్పుడెలా నమ్మేదంటూ ప్రశ్నిస్తున్నారు. ముమ్మాటికీ ఇది ఎన్నికల జిమ్మిక్కుగానే ప్రధాని ప్రకటనను చూస్తున్నారు. రేపు (మంగళవారం) నిజామాబాద్కు ప్రధాని మోదీ రానున్నారు. ఈ పరిస్థితుల్లో పాలమూరులో ఆదివారం జరిగిన సభలో మోదీ ప్రకటనపై రైతులు మండిపడుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే పసుపు బోర్డును ఏర్పాటుచేసి ముందుకు వచ్చేవారని భావిస్తున్నారు. కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని చెప్పిన వారే.. అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై చర్చిస్తున్నారు. ఏదేమైనా పసుపుబోర్డు ప్రకటన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కృషే కారణమని రైతులు అనుకుంటున్నారు. ఎంపీగా కవిత చేసిన పోరాటంతోనే ఈ అంశం జాతీయస్థాయిలో చర్చించే స్థాయికి చేరిందటున్నారు.
9 ఏండ్లు తాత్సార్యం చేసి…
కేంద్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నరేండ్లు గడుస్తున్న బీజేపీ ప్రభుత్వంతో నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. పైగా హామీని నిలబెట్టుకోలేక చేతులెత్తేసి ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నది. 2019 ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ కీలక నేత ప్రకాశ్ జవదేకర్ స్వయంగా పసుపు బోర్డుపై ప్రకటన చేశారు. అడుగడుగునా ఇదే అంశంపై రైతులను రెచ్చగొట్టి తమవైపునకు తిప్పుకున్నారు. గెలిచిన తర్వాత చేతులెత్తేసి ఈ అంశాన్ని బీజేపీ అటకెక్కించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని మోదీ పసుపు బోర్డుకు అనుకూలంగా మాట్లాడడం ఎన్నికల వ్యూహంలో భాగమేనని అంతా అనుకుంటున్నారు. పసుపుబోర్డు అంశాన్ని మరోసారి బీజేపీ రాజకీయం చేస్తున్నది. 2019లో ఇదే అంశంతో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో బీజేపీ పెద్ద నాటకం ఆడింది. రైతులను రెచ్చగొట్టి ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తామంటూ భారీ ప్రకటనలు చేసింది. కానీ, ఇప్పటివరకు బోర్డు ఊసే లేదు. సరికదా స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ఇదే పసుపు బోర్డు అంటూ బీజేపీ ఎంపీ అర్వింద్ నమ్మించే ప్రయత్నం చేశారు. తీరా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈసారి స్వయంగా ప్రధాని మోదీనే ఈ అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చారని భావిస్తున్నారు.
పసుపు ఉత్పత్తిలో నిజామాబాదే టాప్…
పసుపు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేటిగా ఉన్నది. కుర్కుమిన్ శాతం అత్యధికంగా ఉండే పసుపు కేవలం నిజామాబాద్ ప్రాంతంలోనే పండిస్తారు. ఈ పసుపును ఎక్కువగా ఔషధాల్లో వాడుతుంటారు. దశాబ్దాలుగా ఇందూరు గడ్డపై వేలాది మంది రైతులు పసుపును సాగు చేస్తున్నారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. మద్దతు ధర సైతం దక్కడం లేదు. పసుపు బోర్డు అందుబాటులోకి వస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పసుపు రైతులకు ఆసరా దొరుకుతుందనేది వీరి ఆశ. అందుకే నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులు ముఖ్యంగా బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని రైతులు పసుపు బోర్డు కోసం డిమాండ్ చేస్తున్నారు. వీరికితోడు నిర్మల్, జగిత్యాల జిల్లాల రైతులు సైతం పసుపు పంటను భారీగానే సాగుచేస్తున్నారు. వీరంతా ఉమ్మడిగా ఉద్యమాలు చేస్తున్న సమయంలో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ధర్మపురి అర్వింద్ నోటికొచ్చిన ప్రకటనలు చేసి, బాండ్ పేపర్ రాసి బరిలో నిలిచారు. తాను గెలిస్తే పసుపు బోర్డు తెస్తానని నమ్మబలికారు. మద్దతు ధరను సాధిస్తానని చెప్పారు. కానీ ఏ ఒక్క హామీ నెరవేరలేదు. దీంతో రైతులంతా ఆగ్రహావేశాలతో ఎంపీని నిలదీయడం మొదలు పెట్టడంతో ప్రజాక్షేత్రంలో తిరిగే అవకాశం లేకుండా పోవడం, దిక్కులేని స్థితిలోనే మోదీతో పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేయించారని అంతా అనుకుంటున్నారు.
నో చెప్పి.. ఇప్పుడు ఓకే అంటూ..
కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులే 2021 మార్చిలో విడ్డూరమైన ప్రకటనలు చేశారు. 2021 మార్చి 12న రాజ్యసభలో ఎంపీ సురేశ్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. పసుపు బోర్డు ఏర్పాటు అంశమే తమ దృష్టిలో లేదంటూ స్పష్టమైన ప్రకటన చేసింది. బీఆర్ఎస్ ఎంపీ అడిగిన ప్రశ్నను కాపీ కొడుతూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి సైతం 2021 మార్చి 16న లోక్సభలో ప్రశ్నను లేవనెత్తగా.. కేంద్రం ఇదే రీతిలో సమాధానం ఇచ్చింది. సరిగ్గా రెండేండ్ల క్రితం వారం రోజుల వ్యవధిలోనే లోక్సభ, రాజ్యసభల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోమని చెప్పిన కేంద్ర సర్కారే.. ఇప్పుడు మాట మార్చడం విచిత్రంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతోనే ప్రధాని మోదీ నోట పసుపు బోర్డు మాట వచ్చిందని ప్రజలు భావిస్తున్నారు. బీజేపీ తీరుపై పసుపు రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతుండడంతో మోదీయే దిగివచ్చి కీలక ప్రకటన చేయాల్సి వచ్చిందని అనుకుంటున్నారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కేనని కొట్టి పారేస్తున్నారు. ఒక దశలో పాత అంబాసిడర్ కారుతో పసుపు బోర్డును పోల్చిన ఎంపీ అర్వింద్.. అదంతా పాత ముచ్చటంటూ కొట్టి పారేశారు. స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయాన్ని బెంజ్ కారుతో పోలుస్తూ ఇదే సర్వం అంటూ రైతులను నమ్మించారు. సీన్ కట్చేస్తే ఇప్పుడు పాత అంబాసిడర్ కారే బీజేపీకి దిక్కయ్యింది.
ఎన్నికల్లో లబ్ధి కోసమే..
ఆర్మూర్: 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ పసుపు బోర్డు ఏర్పాటును పదేండ్లు తొక్కి పెట్టింది. ఇప్పుడు కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే మళ్లీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. పసుపు రైతుల కోసం నేను, ఎమ్మెల్సీ కవిత అనేక ఉద్యమాలు చేశాం. మరోసారి రైతులను మోసగించేందుకే మోదీ ప్రకటించారు.
-కోటపాటి నర్సింహనాయుడు, రైతు నాయకుడు
బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దు
మాక్లూర్: బీజేపీ నాయకుల మాటలు విని మోసపోవద్దు. ఎన్నికల హామీలో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి ఎంపీగా గెలిచిన అర్వింద్ నాలుగేండ్లయినా ఏర్పాటు చేయలేదు. మళ్లీ ఎన్నికలు వస్తుండంతో రైతులను మోసం చేసేందుకు పసుపు బోర్డును తెరపైకి తెస్తున్నారు.
-గంగోనె మల్లేశ్, రైతు, కల్లడి
పసుపుబోర్డు కొత్త నాటకం..
పసుపు బోర్డు ఏర్పాటు అనేది కొత్త నాటకం. నాలుగేండ్లలో ఏర్పాటు చేయని పసుపుబోర్డు ఇప్పుడు ఎలా ఇస్తారు. ఎన్నికల ముందు మళ్లీ రైతులను మోసం చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. గతంలో అర్వింద్ రైతులకు రాసి ఇచ్చిన బాండ్పేపర్ అందరికీ తెలుసు.
-న్యాలకంటి భోజన్న, రైతు, ముల్లంగి(బీ)
ఓట్ల కోసమే..
మరోసారి ఎన్నిల్లో బీజేపీ నాయకులు ఓట్లు దండుకునేందుకే పసుపు బోర్డు పేరు వాడుకుంటున్నరు. గత ఎన్నికల సమయంలో అర్వింద్ బాండ్ పేపరు రాసి ఇచ్చి పత్తా లేకుండా పోయిండు. ఇప్పుడు ప్రధాని మోదీ ప్రకటించడం కూడా ఎన్నికల ఎత్తగడ మాత్రమే.
– కాచర్ల గంగారాం, రైతు, మాక్లూర్