ఖలీల్వాడి, ఫిబ్రవరి 4 : రేషన్ దుకాణాల నిర్వహణ తీరును పకడ్బందీగా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రేషన్ డీలర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి రేషన్షాపులో సరుకు స్టాక్ వివరాలను ప్రదర్శించాలని, రేషన్ కేటాయింపులు, వాటి పంపిణీకి సంబంధించిన వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయడం, ఫిర్యాదుల పెట్టె, ఈ-పాస్ మిషన్ ఆధారంగా సరుకుల పంపిణీ, క్యూ లైన్ పద్ధతి తదితర ప్రక్రియలన్నీ పక్కాగా జరిగేలా చూడాలన్నారు.
క్షేత్రస్థాయిలో రేషన్షాపులను తనిఖీలు చేయాలని ఆదేశించారు. తనిఖీల్లో అవకవకలను గుర్తిస్తే నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రతినెలా నిర్ణీత గడువులోగా ప్రజలకు సరుకులు పంపిణీ చేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు. సన్నబియ్యం, దొడ్డు బియ్యం తేడా చూపకుండా వచ్చిన నిల్వలను వచ్చిన విధంగా రేషన్ షాపులకు కేటాయించాలని ఎంఎల్ఎస్ పాయింట్ల నిర్వాహకులను ఆదేశించారు. మోడల్ రేషన్ దుకాణాల కోసం అనువుగా ఉన్న రేషన్ షాపుల జాబితా అందించాలని అన్నారు. రేషన్డీలర్లు గన్నీబ్యాగులను వాపస్ చేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్వో చంద్రప్రకాశ్, అధికారులు పాల్గొన్నారు.