నందిపేట్/ ఆర్మూర్, అక్టోబర్ 21 : బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పాలన సాధ్యమవుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆర్మూర్ మండలం రాంపూర్, మిర్దాపల్లి, నందిపేట్ మండలంలోని సీహెచ్ కొండూర్లో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధికి హద్దు లేని సిద్ధుల గుట్ట గొప్ప దివ్య క్షేత్రం, పర్యాటక స్థలంగా మారిందన్నారు. ఈ అభివృద్ధికి కర్మ, కర్త, క్రియ కేసీఆరే అని పేర్కొన్నారు.
తాను మారంపల్లి గ్రామ అల్లుడినని, తనకు అండగా నిలువాలని కోరారు. మూడోసారి గెలిచి జీతగాడిలా పని చేస్తానని అన్నారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణకు భరోసా అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలోస్తే మళ్లీ అదే అరిగోస పడక తప్పదన్నారు. ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ చిల్లర డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ వ్యతిరేక పార్టీల ఆటలిక్కడ సాగవన్నారు.ఆ పార్టీలకు సింగిల్ డిజిట్ కూడా రాదన్నారు.