వినాయక్నగర్, జూలై 16 : జిల్లాలో రెండు చిరుత పులులను హతమార్చిన కేసును పోలీసు, అటవీశాఖాధికారులు ఛేదించారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి నాటుతుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీపీ సాయి చైతన్య గురువారం కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి అటవీ డివిజన్ పరిధిలోని అన్సాన్పల్లి బీట్ పరిధిలో సుమారు ఐదు నెలల క్రితం ఓ చనిపోయిన చిరుతపులిని అటవీశాఖాధికారులు గుర్తించారు. దర్యాప్తు చేపట్టగా అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన వలలో చిరుతపులి చిక్కుకోగా కొంతమంది దానిని కర్రలతో కొట్టి చంపి దాని చర్మాన్ని, శరీరం భాగాలను ఓ బావిలో పడేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చినట్లు సీపీ వెల్లడించారు.
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని భీమ్గల్ మండలం కారేపల్లి దక్షిణ బీట్ పరిధిలో ఒక చిరుతపులిని కొందరు వ్యక్తులు హతమార్చారు. దీనిపై కమ్మర్పల్లి రేంజ్ అధికారి కె.అనిత, సిబ్బంది దర్యాప్తు చేపట్టి భీమ్గల్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మాలావత్ సంజీవ్, దేవక్కపేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములును అనుమానితులుగా అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో వారు చిరుతపులిని హతమార్చినట్లు అంగీకరించారు. చిరుత కళేబరాన్ని కారేపల్లి దక్షిణ బీట్ పరిధిలోని 79 కంపార్ట్మెంట్లో దాచినట్లు చెప్పడంతో అటవీశాఖ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి.
తాళ్లపల్లి గ్రామంలోని మేకల కాపరి అయిన మాలావత్ సంజీవ్కు చెందిన ఓ మేకపై చిరుతపులి దాడి చేసి హతమార్చింది. ఈ విషయం తెలుసుకున్న దేవక్కపేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములు చిరుతపులి తిరిగి అదే కళేబరం వద్దకు వస్తుందని, దానిని చంపి దాని శరీర భాగాలను అమ్ముకుంటే లక్షల్లో డబ్బు వస్తుందని మాలావత్ సంజీవ్కు ఆశ చూపించాడు. దీంతో అదేరోజు రాత్రి సంజీవ్ గ్రామానికి చెందిన ఇతర నలుగురు వ్యక్తులతో కలిసి ఆ కళేబరంలోకి గడ్డి మందును సిరంజీ ద్వారా ఎక్కించారు.
మరుసటి రోజు ఉదయం వెళ్లి చూడగా చిరుతపులి చనిపోవడంతో కళేబరాన్ని దాచిపెట్టి ఓ కొనుగోలుదారుడి కోసం వెతకసాగారు. చిరుత కళేబరాన్ని గుర్తించిన అటవీశాఖాధికారులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుల్లో ఒకరైన సిరిసిల్ల రాములు ఇంట్లో తనిఖీ చేయగా అక్రమంగా దాచిన ఒక నాటు తుపాకీ దొరికింది. దీంతో చిరుతను చంపిన కేసులో ఇద్దరు నిందితులను అటవీశాఖాధికారులు గురువారం అరెస్టు చేయగా, వీరితో సంబంధం ఉన్న మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సీపీ వివరించారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి నిందితులను ఆర్మూర్ న్యాయస్థానంలో హాజరుపర్చినట్లు తెలిపారు.
సీసీఎస్ బృందం, భీమ్గల్ పోలీసులు సంయుక్తంగా గురువారం తెల్లవారు జామున దేవక్కపేట్ గ్రామశివారులో చేపట్టిన ఆపరేషన్లో అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సాయిచైతన్య వెల్లడించారు.
అదుపులోకి తీసుకున్న వారిని తనిఖీ చేయగా వారి వద్ద 9 నాటు తుపాకులు లభించినట్లు తెలిపారు. నాటు తుపాకులు కలిగి ఉన్న బుక్య రఘుపతి, కార్ల అంజయ్య, ముదావత్ తిరుపతి, బుక్యా చందర్, ముర్రి గంగనర్సయ్య, అనిమేని లింబాద్రి, మలావత్ కుంభ, బానావత్ గంగారెడ్డి, మాలావత్ దారిసింగ్ నిందితులతోపాటు తుపాకులు మరమ్మతు చేసే అకునూరు రాజుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో సీసీఎస్ ఏసీపీపీ శ్రీశైలం, ఆర్మూ ర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, సీఐలు సురేశ్, సత్యనారాయణగౌడ్, సాయినాథ్, ఎస్సై సీహెచ్.తిరుపతిని సీపీ అభినందించారు.
ముందే చెప్పిన
జిల్లాలో చిరుత పులులు హతమైన విషయాన్ని ‘నమస్తే తెలంగాణ‘ ఈ నెల13వ తేదీన పాఠకుల దృష్టికి తీసుకు వచ్చింది. పూర్తివివరాలతో కథనం ప్రచురించింది.