Nizambad | శక్కర్ నగర్ : మద్యం సేవించి, రోడ్డు నియమాలు పాటించని కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్ము పద్మశరత్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీస్ శాఖ, మోటారు వాహనాల శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు రోడ్డు నియమాలపై నిత్యం కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
పోలీసులు సూచించిన విధంగా వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరూ రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని పోషించారు. ఈ సందర్భంగా బోధన్ సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ బోధన్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రమాద ప్రాంతాలను (బ్లాక్ స్పాట్) గుర్తించామని, సదరు ప్రాంతాల్లో వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని అన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రోడ్డు నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సీఐ అన్నారు. అనునిత్యం పోలీస్ శాఖ ప్రజాక్షేమం కోసం పనిచేస్తుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి, పట్టణ సీఐ వెంకట్ నారాయణ తో పాటు ప్రజలు పాల్గొన్నారు.