కామారెడ్డి, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చినట్లే, మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగంఅర్హులైన వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో మైనారిటీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సహాయం కింద ఈ దరఖాస్తుదారుల్లోనే అర్హులను ఎంపిక చేయడానికి జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి వంద శాతం సబ్సిడీతో మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించిన నేపథ్యంలో అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఎకనామిక్ సపోర్ట్ పథకం కింద అర్హులైన మైనారిటీలకు సబ్సిడీ రుణాలు అందజేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే.
జిల్లాలో 5,472 దరఖాస్తులు
జిల్లాలో గత ఏడాది సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 5,472 మంది ఉన్నారు. వారిలో అర్హులైన వారిని గతంలోనే ఎంపిక చేశారు. గత ఏడాది సబ్సిడీ రుణాల కోసం కామారెడ్డి నియోజకవర్గంలో 78 మందిని, బాన్సువాడ నియోజకవర్గంలో 44 మందిని, జుక్కల్లో 58 మందిని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 38 మందిని ఎంపిక చేశారు. జిల్లా లక్ష్యం 218 కాగా అర్హులను ఎంపిక చేశారు. తాజాగా దరఖాస్తు చేసుకున్న వారిలో నుంచి 480 మంది ఎంపిక చేశారు. మొత్తం కలిపి 698 మందికి ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకులతో సంబంధం లేకుండా అర్హులైన మైనారిటీలందరికీ ఏకమొత్తం గ్రాంట్గా అందజేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే అందిన దరఖాస్తులకు ఇది వర్తింపజేయడంతోపాటు క్రిస్టియన్ మైనారిటీల నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నెల 14లోపు క్రిస్టియన్ మైనారిటీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం ద్వారా చిరువ్యాపారులు, వివిధ వృత్తి పనులు చేసుకునే వారికి ఎంతో లాభం చేకూరుతుంది. ఇప్పటికే నిరుపేద విద్యార్థులకు గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. షాదీ ముబారక్తో ఎంతో లాభం జరుగుతున్నది. తాజాగా ప్రారంభించిన రూ.లక్ష ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంది. జిల్లాలో 698 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. మైనారిటీల్లో చాలా మంది చిరు వ్యాపారాలు, మెకానిక్ పనులు, మోటర్ రీవైండింగ్ పనులు, మిర్చీ బండీలు ఇలా అనేక పనులు చేస్తుంటారు. వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రశంసనీయం. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
-ఎంకే ముజీబుద్దీన్, ఉర్దూ అకాడమీ చైర్మన్