నిజామాబాద్, ఫిబ్రవరి 17, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ పన్ను వసూళ్లతో పల్లెల అభివృద్ధికి పాటుపడేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆస్తి, కుళాయి, ఆస్తి మార్పిడి తదితర పన్నుల రాబడితో పంచాయతీలకు ఆదాయం పెరుగుతున్నది. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉండడం, విస్తీర్ణం ఎక్కువ ఉండడం, పంచాయతీలు అధికంగా ఉండడంతో జిల్లా స్థాయి అధికారుల నుంచి పంచాయతీ సిబ్బందికి సరైన తోడ్పాటు అందేది కాదు. ప్రస్తుతం పరిధి చిన్నదిగా మారడంతో జిల్లా స్థాయి అధికారులు నిత్యం పంచాయతీ సిబ్బందిని పురమాయిస్తూ ఎక్కువ శాతం వసూలు చేసేందుకు అవకాశం ఏర్పడింది.
గ్రామాల్లో కార్యదర్శుల కొరత ఇప్పుడు లేకపోవడంతో సర్పంచులు, గ్రామాభివృద్ధి కమిటీల సమన్వయంతో పన్నులు వసూలు సాఫీగా సాగుతున్నది. 2023 కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే ఉన్నతాధికారులు పన్ను లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. మార్చి 31లోపు పన్ను వసూళ్ల టార్గెట్ను రీచ్ అయ్యేందుకు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సారి లక్ష్యం రూ.32 కోట్లుగా ఉంది. ఇందులో దాదాపుగా సగం వరకు లక్ష్యం చేరినట్లు సమాచారం.
పల్లెల వికాసానికి…
గ్రామాల్లో వంద శాతం పన్నులు వసూలై.. ఆ నిధులు పూర్తిగా సద్వినియోగమైతే పల్లెలు పచ్చగా ఉంటాయి. ప్రతి గ్రామానికీ మౌలిక వసతులు సమకూరుతాయి. మురికి కాలువలు , వీధి దీపాలు, నీటి పథకాల నిర్వహ ణ, మరమ్మతులు, రహదారుల నిర్మాణం తదితర పనులన్నీ చకచకా చేసుకోవచ్చు. అందుకే పంచాయతీల్లో పన్నుల వసూలుకు జిల్లా అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు పన్నుల కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్గా దృష్టి పెట్టింది. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహించే పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రకారం చర్యలు తీసుకునే వీలుండడంతో వారంతా పన్నుల వసూళ్లకు పాటుపడుతున్నారు.
రాజకీయాలకతీతంగా ప్రజలతో సమావేశమై పన్నులను వసూళ్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 530 గ్రామ పంచాయతీల్లో రూ.32కోట్ల పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇందులో 50శాతానికి లక్ష్యం చేరువైనట్లు సమాచారం. దాదాపు రూ.15కోట్ల నుంచి రూ.18కోట్ల వరకు పన్ను వసూళ్లు అయినట్లు అధికారులు చెబుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లలో జిల్లాలో 85శాతం మేర లక్ష్యం నెరవేరింది. 2021-22లో 94శాతం చేరువైంది. 2022-23లో 100 శాతం చేరుకునేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
పకడ్బందీగా వసూళ్లు…
గ్రామ పంచాయతీ పన్నుల వసూళ్లలో అక్కడక్కడ నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా బయటపడుతున్నది. వంద రోజుల ముందు నుంచే వంద శాతం పన్నుల వసూళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ కొంత మంది పన్నుల వసూళ్లపై సీరియస్గా దృష్టి పెట్టడం లేదు. తమ విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తుండడంపై కొరడా ఝుళింపించేందుకు ఉన్నతాధికారులు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చురుగ్గా పన్నుల వసూళ్ల పర్వం కొనసాగుతున్నది. ఇందులో నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రక్రియ ఏటా టాప్లో ఉంటున్నది. ఆర్థిక సంవత్సరం దాదాపు ముగింపునకు చేరుకోవడంతో 15 రోజులకోమారు ఉన్నతాధికారులు స్వయంగా ఈ అంశంపై ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు.
పన్నుల వసూళ్లలో పరుగులు పెట్టించాలని జిల్లా పంచాయతీ అధికారికి, శాఖ సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు. కింది స్థాయి సిబ్బందిని పరుగులు పెట్టించి పన్ను వసూళ్ల టార్గెట్ను రీచ్ అయ్యేందుకు శతవిధాలుగా యత్నిస్తున్నారు. ఇంకా నెలన్నర రోజుల సమయం ఉండటంతో పక్కాగా గత లక్ష్యానికి చేరువయ్యేందుకు పంచాయతీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. వంద శాతానికి చేరువవ్వడం ఖాయంగానే పెట్టుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులంతా కలిసికట్టుగా పన్నుల వసూళ్లకు పాటుపడేలా, సమన్వయంతో లక్ష్యాన్ని సులువుగా చేరుకునేందుకు జిల్లా స్థాయిలో అధికారులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
శత శాతం వసూలు చేస్తాం…
నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీల్లో వసూలు చేయాల్సిన పన్నుల మొత్తాన్ని వంద శాతం చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏటా పన్ను వసూళ్లలో జిల్లా వృద్ధిని సాధిస్తున్నది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది కృషితో ఇదంతా సాధ్యం అవుతున్నది. మార్చి నెలాఖరులోగా భారీ లక్ష్యాన్ని చేరుకుంటామన్న ధీమా మాలో ఉన్నది.
– జయసుధ, నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిణి