ఎల్లారెడ్డి (లింగంపేట్)/నందిపేట/ ఆర్మూర్ టౌన్, ఏప్రిల్ 29: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాలల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్వీ నాయకులను బుధవారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నందిపేట మండలం కంఠం గ్రామంలో బీఆర్ఎస్వీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరి అభిలాష్ను పోలీసులు ఉదయం అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఉదయమే పోలీసులు ఇంటికి రావడంతో ఆయన కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. లింగంపేటలో బీఆర్ఎస్వీ నాయకుడు, మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచారు. ఆయనతో పాటు మాజీ ఎంపీపీ ముదాం సాయిలు ఉన్నారు.
ఆర్మూర్ పట్టణంలో కెనాల్ బ్రిడ్జిపై ధర్నా నిర్వహించకుండా తెల్లవారుజామునే తమను అరెస్టు చేసినట్లు బీఆర్ఎస్వీ నాయకులు అగ్గు క్రాంతి, మీరా శ్రావణ్, షాహిద్ తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిలాష్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై పోరాడుతుంటే పోలీసులు, ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదన్నారు.
పోలీసులు ఎన్ని అక్రమ ఆరెస్టులు చేసినా, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు విడుదల చేసే వరకు పోరాటాన్ని ఆపేదిలేదని స్పష్టం చేశారు. విద్యార్థుల ఉసురుపోసుకుంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడక తప్పదని హెచ్చరించారు. విద్యార్థులకు బీఆర్ఎస్వీ ఎల్లప్పుడు అండగా ఉండి పోరాటం చేస్తుందన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో పెట్టుకుంటే మాడి మసైపోతారని హెచ్చరించారు.