రెంజల్, జనవరి 19: గ్రామీణ ప్రాంత ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని కొందరు దుండగులు మాయమాటలు చెప్పి చోరీలకు పాల్పడుతున్నారు. జన సందోహం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా రెంజల్ మండలం నీలా గ్రామంలో పింఛన్ డబ్బులు ఇవ్వడానికి ఆఫీసర్లు వస్తున్నారంటూ ఓ వృద్ధురాలిని నమ్మిం చి ఆమె చెవులకు ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలా గ్రామానికి చెందిన అంబెం పోసాని అనే వృద్ధురాలు తన కొడుకు, కోడలు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లడంతో ఇంటి గడప వద్ద కూర్చున్నది. ఇంతలో అక్కడికి హెల్మెట్ ధరించిన ఓ దుండగుడు బైక్పై వచ్చి వృద్ధురాలి ఇంటిముందు నిలిపాడు. పేదవృద్ధులను గుర్తించి పింఛన్ డబ్బులు ఇవ్వడానికి ఆఫీసర్లు వస్తున్నారని, పాన్కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కావాలని, ఒంటిపై బంగారం తీసివే యాలని వృద్ధురాలికి సూచించాడు. వృద్ధురాలిని మ రింత నమ్మించడానికి అక్కడే ఉన్న అర్చన అనే బాలికకు రూ.50 ఇచ్చి పాన్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకురావాలని పంపించాడు.
అనంతరం వృద్ధురాలు తన చెవులకు ఉన్న 12 మాసాల బంగారు నగలను ఓ కవర్లో ఉంచి, ఇంట్లో దాచాలంటూ దుండగుడి చేతికిచ్చింది. దీంతో దుండగుడు ఆమె ఇంట్లోకి వెళ్లి నగలను జేబులో దాచుకొని కవర్ను మాత్రమే అక్కడ ఉంచి పరారయ్యాడు. కాసేపటికి జిరాక్స్ తీసుకొని వచ్చిన అర్చన.. ఇంట్లోకి వెళ్లి చూడగా కవర్ మాత్రమే ఉండడంతో దుండగుడు నగలను ఎత్తుకెళ్లినట్లు వృద్ధురాలు తెలుసుకొని బోరున విలపించింది. విషయం తెలుసుకొన్న రూరల్ సీఐ శ్రీనివాస్రాజు, రెంజల్ ఎస్సై పి. ఉదయ్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వృద్ధురాలితో మాట్లాడి వివరాలు తెలుసుకొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నారు. చోరీకి పాల్పడిన దుండగుడిని గుర్తించేందుకు సీసీ కెమెరా పుటేజీలు,ఆధారాలను సేకరించడానికి మూడు బృందాలను రంగంలోకి దించినట్లు రూరల్ సీఐ తెలిపారు.