జక్రాన్పల్లి, అక్టోబర్ 8 : ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయని అన్నారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నదని తెలిపారు. మండలంలోని మునిపల్లి, లక్ష్మాపూర్, నారాయణపేట్ గ్రామాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ సంఘాల సభ్యులకు రూ.కోటీ 45 లక్షల విలువ గల ప్రొసీడింగ్ కాపీలను ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ సహకారంతో రూరల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలకు రూ.16 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరే అని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి కాంగ్రెస్, బీజేపీ నుంచి నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కల్లబొల్లి మాట లు నమ్మి మోసపోవద్దని సూచించారు.
నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి, అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీల నాయకులు వచ్చి మాయమాటలు చెబుతారని, కానీ మనకు అందుబాటులో ఉన్నది ఎవరు?.. కష్టసుఖాల్లో పాలుపంచుకున్నది ఎవరు.. అభివృద్ధి చేసిందెవరనేది ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కుంచాల విమల, జడ్పీటీసీ తనూజ, వైస్ ఎంపీపీ ముస్కు తిరుపతిరెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, మండల కో-ఆప్షన్ మెంబర్ అక్బర్ఖాన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఢీకొండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మైదం రాజన్న, అనంత్రెడ్డి, పార్టీ మునిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు రాజారెడ్డి, భాస్కర్, నారాయణపేట సర్పంచ్ రబ్బా వెంకట్, లక్ష్మాపూర్ సర్పంచ్ కైలాస్, ఎంపీటీసీ గుడాల అను, బీఆర్ఎస్ నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.