నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 16 : రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కర్షక, కార్మిక విధానాలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త బంద్ జిల్లాలో విజయవంతమైంది. పలు చోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడంతోపాటు ఇతర సమస్యలు
ఇందల్వాయి ఎన్హెచ్-44 జాతీయ రహదారిపై సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యదర్శి ఆకుల పాపయ్య ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జక్రాన్పల్లిలో మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెలో పాల్గొని తహసీల్దార్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు.
జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఏఐఎస్బీ, ఏఐఎఫ్డీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పరిశోధక విద్యార్థుల ఫెలోషిప్లో కోతను విరమించుకోవాలన్నారు. ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బోధన్లో ఐఎఫ్టీయూ, సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మాక్లూర్ మండలంలోని మానిక్బండార్ చెక్క వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. బాల్కొండలో మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మెలో పాల్గొని తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఆర్మూర్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భీమ్గల్ మండలంలోని అన్ని గ్రామాల కారోబార్లు, జీపీ సిబ్బంది, కార్మికులు సమ్మెలో పాల్గొని నిరసన తెలిపారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నవీపేటలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.