బాన్సువాడ, మార్చి 1: మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దగా చూపిస్తున్నారని మాజీ సభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి శుక్రవారం మేడిగడ్డ బరాజ్ పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ..ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదో అయిపోయినట్టు, లేనిది ఉన్నట్లు చూపిస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్ 86 పిల్లర్లలో మూడు పిల్లర్లు కుంగాయని తెలిపారు. అవి ఎందుకు కుంగాయి, అందు లో ఏదైనా సాంకేతిక సమస్య ఉండవచ్చని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా జరగనట్లు ఒక్క మేడిగడ్డలో జరిగినట్లు భూతద్దంలో పెట్టి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్లులో నీరు ఎక్కువగా ఉన్నచోట ఉన్న 83 పిల్లర్లు బాగున్నాయని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా అనేక బరాజ్లు, రిజర్వాయర్లు, 1530 కిలోమీటర్ల మేర కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగం తవ్వి, లిఫ్టులు కట్టినట్లు తెలిపారు. సముద్రమట్టం కన్నా సుమారు 600 మీటర్లలోతు నుంచి నీటిని తోడి ఎడారిగా మారుతున్న తెలంగాణను సస్యశ్యామలం, సుభిక్షం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. దీనిని కొందరు జీర్ణించుకోవడంలేదన్నారు.ప్రభుత్వానికి రైతులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల పనులను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. పోచారం వెంట డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఉన్నారు.