వినాయక్నగర్, ఫిబ్రవరి 5: నిజామాబాద్ జిల్లాలో చిన్నారుల వరుస కిడ్నాప్లు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు రోజుల్లోనే మూడు ప్రాంతాల్లో పిల్లలు అపహరణకు గురయ్యారు. ఇందులో ఇద్దరు పిల్లలను పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. కిడ్నాప్కు గురైన వారంతా ఏడేండ్ల వయసులోపు పిల్లలు కావడం చర్చనీయాంశంగా మారింది. సులువుగా లక్షలు సంపాదించాలనే ఉద్దేశంతోనే పలువురు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నట్లు సమాచారం. కొందరు ముఠాగా ఏర్పడి పిల్లలను కిడ్నాప్ చేసి రాష్ర్టాలు దాటిస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లోని ఇండ్లు, హోటళ్లలో పనులకు పెట్టి వెట్టి చాకిరీతోపాటు భిక్షాటనకు ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.
రద్దీ ప్రాంతాలు, ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారులను నమ్మిస్తూ, మాయమాటలు చెబుతూ కిడ్నాపర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తారు. అడ్రస్ చెప్పాలంటూ పెద్దలను పరిచయం పెంచుకొని దానిచాటున పిల్లలను అపహరించే అవకాశం ఉన్నది. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలతోపాటు తక్కువ జనసంచార ప్రాంతాలను ఎంపిక చేసుకొని కిడ్నాప్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా చుట్టుపక్కల ఉండే వాళ్లే పిల్లల అపహరణలో పాలుపంచుకోవడం విస్తుగొల్పుతున్నది.
ఇటీవల పలు సామాజిక మాధ్యమాల్లో చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠా సంచరిస్తుందంటూ ఓ వార్త దావానంలా వ్యాపిస్తున్నది. ఇదే సమయంలో జిల్లాలో వరుసగా పిల్లలు కిడ్నాప్కు గురవ్వడం ప్రజలను బెంబేలెత్తిస్తున్నది. గతంలో ఎన్నడూ లేనంతా వరుసగా కిడ్నాప్లు జరగడంపై అనుమానాలకు తావిస్తున్నది.
నగరంలోని మాలపల్లికి చెందిన మహ్మద్ మీహాజ్ (7) అనే బాలుడిని ఓ ముఠా కిడ్నాప్ చేసింది. బాలుడిని హైదరాబాద్లో రూ.3లక్షలకు విక్రయించింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసు ప్రత్యేక బృందాలు.. నాలుగు రోజుల్లో బాలుడిని రక్షించారు. కిడ్నాప్కు పాల్పడిన ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఆర్మూర్ బస్టాండ్లో మెండోరాకు చెందిన గగన్ సిద్ధార్థ్ తేజ్(7) అనే బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. తల్లిదండ్రులు బస్సు ఎక్కే ప్రయత్నంలో ఉండగా బాలుడిని తీసుకొని ఆ మహిళ మెట్పల్లి వైపు బస్సులో వెళ్లింది. మార్గమధ్యంలో ప్రయాణికులకు అనుమానం వచ్చి కమ్మర్పల్లి పోలీస్స్టేషన్కు తరలించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద ఏడాదిన్నర బాబు(గణేశ్)తో తల్లి భిక్షాటన చేస్తుంటుంది. ఆదివారం ఉదయం ఓ జంట ఆ మహిళతో పరిచయం పెంచుకొని రాత్రి వరకు ఆమెతోనే ఉన్నారు. రాత్రి 8.30గంటల సమయంలో తల్లీబిడ్డలను తమ బైక్పై ఎక్కించుకొన్న జంట కంఠేశ్వర్ బైపాస్ వద్దకు తీసుకెళ్లింది. అక్కడే ఉన్న కల్లు బట్టీలో ఆమెకు కల్లు తాగించి ఏడాదిన్నర బాబును అపహరించుకొని వెళ్లారు. వెంటనే తేరుకున్న తల్లి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానిత జంట తిరిగిన ప్రదేశాల్లోని సీసీ ఫుటేజీని పరిశీలించగా బాలుడిని తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.