ఖలీల్వాడి, డిసెంబర్ 6 : రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా వివిధ శాఖల అధికారులు అంకితభావంతో పనిచేయాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు సూచించారు. జిల్లా పరిషత్ హాల్లో బుధవారం చైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా పాల్గొన్నా రు. ముందుగా ఇటీవల గుండెపో టుతో మృతి చెందిన బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డికి సంతాపంగా మౌనం పాటించారు. అనంతరం ఎజెండాలోని వివిధ అంశాలపై చర్చ చేపట్టి, వ్యవసాయ, అనుబంధ శాఖల పనితీరుపై సమీక్షించారు. రైతులకు రుణమాఫీ చేయాలని సభ్యులు కోరగా, అర్హులైన వారందరికీ లక్ష రుణమాఫీ ద్వారా ప్రయోజనం చేకూరేలా చొరవ చూపాలని సంబంధిత వ్యవసాయాధికారులతోపాటు లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్కు జడ్పీ చైర్మన్ సూచించారు. ఈసారి వానకాలం సీజన్లో జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని పౌర సరఫరాల శాఖ అధికారులు సమావేశంలో సభ్యుల దృష్టికి తెచ్చా రు.
ఇందులో సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కన్నా ప్రైవేట్ మార్కెట్లో వ్యాపారులు కొంతమేర ఎక్కువ ధర చెల్లించడంతో అనేకమంది రైతులు వారికి పంటను విక్రయించారన్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించగలిగామని వివరించారు. ధాన్యం విక్రయించిన 50,732 మంది రైతుల ఖాతాల్లో 80 శాతం మేర రూ.714 కోట్లను జమ చేసినట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో మిగతా 20 శాతం బిల్లుల చెల్లింపులు పూర్తి చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులపై సభ్యు లు ప్రస్తావించగా, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అంది న వెంటనే దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని డీఎస్వో చంద్రప్రకాష్ వివరణనిచ్చారు. పశుసంవర్ధక శాఖ ద్వారా చేపడుతున్న గోపాలమిత్ర నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని జడ్పీ చైర్మన్ సూచించారు.
పాఠశాలల్లో సామగ్రికి భద్రత కల్పించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన చోట తక్షణమే నైట్ వాచ్మెన్లు, అటెండర్లను నియమించి బడుల్లో సామగ్రికి భద్రత కల్పించాలని డీఈవోకు సూచించారు. వైద్యారోగ్య శాఖపై చర్చ సందర్భంగా సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ మెరుగైన వైద్య సేవలందేలా పర్యవేక్షణ జరుపాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుదర్శన్ను ఆదేశించారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో ఇంటింటి సర్వే జరిపించి సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి అవసరమైన మందులు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో గోవింద్, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.