Nizamabad | సారంగాపూర్, ఏప్రిల్ 4 : దుబాయ్ దేశంలోని ఓ కంపెనీలో ఇండియాలోని తెలంగాణ ప్రాంత నిజామాబాద్ రూరల్ మండలంలోని మారుమూల పల్లె అయిన లింగితండా కు చెందిన అబ్బాయి, శ్రీలంక దేశానికి చెందిన అమ్మాయి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి, అయిదేళ్ల పాటు ప్రేమ ప్రయాణంలో సాగిన వారిద్దరూ శనివారం ఘనంగా జరిగిన వివాహం వేడుకల వేదికగా జీవితభాగస్వాములుగా ఒక్కటయ్యారు.
ఇరువురు కుటుంబీకులు పెళ్లి వేడుకలకు హాజరై అక్షింతలు వేసి నూతన వధువు, వరులను ఆశీర్వదించడం విశేషం. అబ్బాయి కుటుంబీకుల కథనం ప్రకారం.. లింగితండా నివాసి బొంత వెంకటేష్ బీ టెక్ పూర్తి చేసి 2019లో ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఎల్టన్ ప్రాపర్టీ అనే కంపెనీలో ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే కంపెనీలో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న శ్రీలంక దేశానికి చెందిన ఉమేక తారుషి, వెంకటేష్ ల మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఇలా వారి ప్రేమ ప్రయాణం అయిదేళ్ల పాటు కొనసాగింది. ఇక తమ తల్లిదండ్రులను ఒప్పించి వారి సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని ఇరువురు నిర్ణయించుకున్నారు. దీంతో వెంకటేష్ శ్రీలంకకు వెళ్లి తమ ప్రేమ విషయాన్ని తారుషి తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు.
అదేవిధంగా ఇక్కడ తన తల్లిదండ్రులకు కూడా వెంకటేష్ ప్రేమ గురించి చెప్పగా పెళ్లి జరిపేందుకు అంగీకరించారు. దీంతో గత పది రోజుల క్రితం తారుషి, ఆమె తల్లిదండ్రులు సేనాధిపతి గే నీలంతీ పెరీర, గలానీ గమగే జనక ప్రియదర్శన సిల్వా లింగితండా కు చేరుకున్నారు. ఇరువురు కుటుంబ సభ్యులు కలిసి హిందూ సాంప్రదాయ బద్దంగా శుక్రవారం హల్దీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం కొత్తపేట గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయం ఆవరణలో ఉన్న ఫంక్షన్ హాల్ వెంకటేష్, తారుషి వివాహం వేడుకలు వేదపండితుల మధ్య ఘనంగా జరిపారు. లింగితండా సర్పంచ్ రమేష్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు సాయిలు, బంధుమిత్రులు అందరూ వివాహానికి హాజరై వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.