తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన అనంతరం తొలిసారిగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ప్రభంజనం సృష్టించింది. ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. సభకు ఆయా రాష్ర్టాలకు చెందిన వివిధ పార్టీల అధిపతులు, ముఖ్యమంత్రులు, కీలక రైతు సంఘాల నేతలంతా హాజరుకావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. లక్షలాదిగా తరలివచ్చిన జనంతో ప్రతిపక్ష పార్టీల్లో వణుకు మొదలైంది. బీఆర్ఎస్ లక్ష్యాలు, దేశ భవిష్యత్తును మార్చే వ్యూహాలకు సంబంధించిన ఎజెండాను కేసీఆర్ సవివరంగా ప్రజల ముందుకు తీసుకురావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేపట్టిన ఉద్యమానికి సబ్బండవర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. ప్రజలు తండోపతండాలుగా తరలిరావడంతో సభ దిగ్విజయమైంది. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ తొలిసభ గ్రాండ్ విక్టరీతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని గులాబీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తున్నది. చారిత్రక సభకు ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు పలువురు ముఖ్య నాయకులంతా తరలివెళ్లారు.
నిజామాబాద్, జనవరి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత అధినేత కేసీఆర్ కీలకమైన ముందడుగు వేశారు. మునుగోడులో తొలివిజయం అందుకున్న ఉత్సాహంతో ఖమ్మం గుమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి జాతీయ రాజకీయాల్లో గులాబీ జెండా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఈ సభకు ఆయా రాష్ర్టాలకు చెందిన పార్టీ అధిపతులు, ముఖ్యమంత్రులు, కీలక రైతు సంఘాల నేతలంతా హాజరవ్వడంతో ప్రజలందరి దృష్టి కేంద్రీకృతమైంది. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ సాగిన కార్యకర్తల నినాదాల హోరులో కీలక ఉపన్యాసం అందరినీ కట్టిపడేసింది. బీఆర్ఎస్ లక్ష్యాలను, దేశ భవిష్యత్తును మార్చే వ్యూహాలకు సంబంధించిన ఎజెండాను సవివరంగా కేసీఆర్ ప్రజల ముందుకు తీసుకురావడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ తీరుకు వ్యతిరేకంగా కదులుతున్న కేసీఆర్కు సబ్బండ వర్గాల ప్రజలంతా దీవెనలు అందిస్తున్నారు. దేశాన్ని మతతత్వ శక్తుల నుంచి కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకుగాను కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా జనాలంతా జై కొడుతూ మద్దతు తెలుపుతుండడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి పార్టీ కొరకరాని కొయ్యలా తయారైంది. అనేక రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసి, ప్రతిపక్ష పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసేందుకు కంకణం కట్టుకున్న బీజేపీకి కేసీఆర్ రూపంలో ముచ్చెమటలు తప్పడం లేదు. తెలంగాణ అభివృద్ధిపై పేచీలు పెడుతూ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న నరేంద్ర మోదీ సర్కారు తీరును తీవ్రంగానే కేసీఆర్ ఎండగడుతున్నారు. జాతీయ స్థాయిలో మోదీ అరాచక పరిపాలనను బట్టబయలు చేయడం కోసం కేసీఆర్ ఇప్పుడు మరోసారి పిడికిలి బిగించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకురావడంతోపాటు భావ సారూప్యత కలిగిన జాతీయ స్థాయి ప్రాధాన్యత కలిగిన నేతలను కలుపుకొని చక్కని వేదికను గులాబీ దళపతి నిర్మాణం చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ఖమ్మం వేదికగా జరిగిన భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో మరో పేజీని లిఖించుకున్నది. 2001లో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి తొలి నాళ్లలోనే భారీ సభలతో ప్రజల్లోకి దూసుకుపోయింది.
దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం చేస్తూ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత వ్యవసాయ రంగం నిరాదరణకు గురైంది. దశాబ్దాల తరబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయి. తత్ఫలితంగా రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోయింది. దీంతో తెలంగాణ రైతుకు ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యే శరణ్యంగా భావించాడు. రైతు ఇలా అనేక సమస్యలతో సతమతం అవుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. సంక్షోభంలో చిక్కుకున్న రైతులను గట్టెక్కించడానికి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి ముఖ్యమంత్రిగా రైతు, వ్యవసాయ రంగ సమస్యల పరిష్కార మార్గాలపై స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లారు. ఇందులో భాగంగానే రాష్ట్ర బడ్జెట్లో అధిక భాగం వ్యవసాయ రంగానికి కేటాయించి అన్నదాతలకు ఊహించిన దానికన్నా ఎక్కువే సాయం అందించారు. సాగుకు 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, సాగు నీరు, సకాలంలో ఎరువులు, విత్తనాలు, వ్యవసాయానికి అన్ని రకాలుగా ప్రోత్సాహాలతో పరుగులు పెట్టించారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అని నినదించినట్లుగానే నినాదాన్ని నిజం చేసి చూపించారు. ఇప్పుడు ఇదే పంథాను దేశ వ్యాప్తంగా అమలు చేసి భారతీయ రైతును ఉన్నతికి తీసుకువచ్చే ఉద్దేశంతోనే కేసీఆర్ మరో పోరాటానికి సిద్ధమయ్యారు.
బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన అనతి కాలంలోనే చారిత్రక సభతో సత్తా చాటింది. ఇందుకు పలు రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, జాతీయస్థాయి రైతు నాయకులంతా పాల్గొనడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ తొలి సభ గ్రాండ్ విక్టరీతో ఉమ్మడి జిల్లాలోని గులాబీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తున్నది. చారిత్రక సభకు ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు పలువురు ముఖ్య నాయకులంతా తరలివెళ్లారు. ఖమ్మం సభ స్ఫూర్తితో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయానికి బాటలు వేసేందుకు వారంతా సమాయత్తం అవుతున్నారు.
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఒక్కడిగా మొదలైన టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెంది దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు ముందుకు పయనిస్తున్నది. రైతును ఆదుకునేందుకు భారీ ప్రణాళికతో సీఎం కేసీఆర్ నడుం బిగించారు. తెలంగాణలో రైతుకు దక్కుతున్న మద్దతును దేశ వ్యాప్తంగా అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేయబోతోంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో తొలి సభ దిగ్విజయం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సభతో ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వానికి భయం పట్టుకున్నది.
– వేముల ప్రశాంత్ రెడ్డి,
రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి
తెలంగాణ ప్రదాత, సీఎం కేసీఆర్ సత్తా ఏమిటో మరోసారి ఖమ్మం సభ ద్వారా నిరూపితమైంది. ఎంత కసిగా పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించారో అదే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ద్వారా పోరాటం చేయబోతున్నారు. రైతును ఆదుకోవడమే లక్ష్యంగా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్తున్నాం. కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర. యుగ పురుషుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనతో పెట్టుకున్నోళ్లు బాగుపడ్డోళ్లు ఎవరూ లేరు. బీజేపీకి అధోగతి ఖాయం.
– ఆశన్నగారి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు
బాన్సువాడ, జనవరి 18: ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ చారిత్రాత్మకం. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్కు మద్దతుగా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఆశీర్వదించారు. ప్రజలు, రైతులకు ప్రవేశపెట్టిన రైతుబంధు, విద్య, వైద్యం, తాగునీరు, కరెంటు, సాగునీరు, కంటి వెలుగు , బస్తీ దవాఖాన కార్యక్రమాలు చాలా గొప్పవని అతిథులు చెప్పడమే సీఎం కేసీఆర్ పాలనకు నిదర్శనం. రాబోవు రోజుల్లో బీఆర్ఎస్, పీఎంగా కేసీఆర్ పాలన రాబోతున్నది. దేశ ప్రజలు, రైతులకు మంచి రోజులు రాబోతున్నాయి.
– పోచారం భాస్కర్రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్
డిచ్పల్లి, జనవరి 18: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అనంతరం తొలిసారిగా ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ జాతీయ భారీ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయింది. ఖమ్మం వేదికగా కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామం. సభకు మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలు హాజరుకావడం గొప్ప విషయం. సభ విజయవంతంతో బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించడం ఖాయం.
-బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్
విద్యానగర్, జనవరి 18: బీజేపీని ఎదుర్కొవాలంటే కేసీఆర్ వంటి గొప్ప నాయకుని నాయకత్వం కావాలి. దేశం మొత్తం రైతు రాజ్యం రావాలంటే అది కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించాలంటే అది కేసీఆర్లాంటి బలమైన నాయకుడు కావాలి. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కేసీఆర్ పెనుమార్పులు సృష్టించబోతున్నాడు.
– గంప గోవర్ధన్, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్,కామారెడ్డి
ఖలీల్వాడి, జనవరి 18: దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందని ఖమ్మం బహిరంగ సభతో మరోసారి రుజువు చేసింది. సభకు మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులు రావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి సీఎం కేసీఆర్ వైపు అన్ని రాష్ర్టాల పార్టీ నాయకులు అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ దేశంలోని అన్ని రాష్ర్టాల్లో దూసుకుపోతుంది.
-బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్యే, నిజామాబాద్ అర్బన్
నిజాంసాగర్, జనవరి 18: ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగసభ చారిత్రాత్మకం. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తున్న దేశ ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జాతీయ స్థాయి నాయకులంతా హాజరై సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలపై ప్రశంసలు కురిపిస్తూ తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలను ప్రవేశపెడతామనడం గర్వించదగ్గ విషయం. సీఎం కేసీఆర్ ప్రజల కోసం ఏ విధంగా ఆలోచిస్తారో అర్థమైంది.
– హన్మంత్షిండే, ఎమ్మెల్యే, జుక్కల్
బోధన్, జనవరి 18: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మంలో నిర్వహించిన సభ దేశానికి దశ, దిశను నిర్ధేశించింది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి పార్టీల నాయకులు, అనేక మంది ప్రముఖులు రావడం చూస్తుంటే.. మొదటి సభతోనే బీఆర్ఎస్ ప్రభంజనాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్కు దేశ ప్రజల్లో ఉన్న ఆదరణకు ఖమ్మం సభ విజయవంతమే నిదర్శనం.
– మహ్మద్ షకీల్, ఎమ్మెల్యే, బోధన్
ఎల్లారెడ్డి, జనవరి 18: దేశంలో రైతును రాజును చేసేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. దేశంలో మార్పు కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్న పథకాలు దేశంలోని రైతులకు అమలు చేస్తే ప్రతి రైతూ రాజు అవుతాడు. ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతుబంధు వంటి పథకాలతో ఇక్కడి రైతులు అభివృద్ధి చెందుతున్నారు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం.
– సురేందర్, ఎమ్మెల్యే,ఎల్లారెడ్డి