బాన్సువాడ, సెప్టెంబర్ 1 : స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామంటూ వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తీర్మానాలు చేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థిగా పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రకటించిన నాటి నుంచి ఆయా గ్రామా ల వారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా బాన్సువాడ మండలంలోని కోనాపూర్, జేకే తండావాసులు తామంతా స్పీకర్ వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
బాన్సువాడలోని స్పీకర్ పోచారం స్వగృహానికి శుక్రవారం తరలివచ్చారు. తమ తండాను గ్రామ పంచాయతీ గా ఏర్పాటు చేయడంతో పాటు అవరమైన అన్ని రకాల పనులు కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ తండా వాసులు అందరూ కలిసి చేసిన తీర్మాన పత్రాన్ని పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు.
అదే విధంగా మారుమూల గ్రామమైన కోనాపూర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన పోచారం రుణం తీర్చుకోలేనిదన్నారు. వచ్చే ఎన్నికల్లో పోచారం వెంటే ఉంటామని గ్రామస్తులు అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పోచారం శ్రీనివాస రెడ్డికి బాన్సువాడ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్కు రెండు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
గులాబీ జెండా తప్ప తమ గ్రామాల్లో వేరే జెండాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వేరే పార్టీల ఆభ్యర్థులు తమ గ్రామానికి రావద్దని స్పష్టం చేశారు. జేకే తండా పెద్దలు సంగ్యా నాయక్ , జమ్లా కార్బా రీ, బన్సీలాల్, జగ్రామ్, మూడ్ బన్సీ, సురేశ్, రూప్సింగ్, కోనాపూర్ గ్రామ సర్పంచ్ వెంకటరమణ రావు దేశ్ముఖ్, ఎంపీటీసీ హన్మాండ్లు, గ్రామశాఖ అధ్యక్షుడు రాజు, ఉప సర్పంచ్ సాయిలు, నోరి గంగారాం తదితరులు ఉన్నారు.