బోధన్ రూరల్, మార్చి 25: బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని పిడిగుద్దులాటను నిర్వహించారు. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు గ్రామస్తులు రెండు గ్రూపులుగా విడిపోయి హనుమాన్ మందిరం వద్దకు చేరుకొన్నారు. అడ్డంగా కట్టిన తాడుకు రెండు వైపులా నిల్చొని ముఖాలు, వీపులపై పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ ఆట సుమారు ఐదు నిమిషాలపాటు కొనసాగగా..దీనిని తిలకించడానికి సమీప ప్రాంతాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి ప్రజలు తరలివచ్చారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, రూరల్ సీఐ నరేశ్ బందోబస్తు ఏర్పాటు చేశారు.