ధర్పల్లి, జనవరి 2: బ్యాంకు చోరీకి విఫలయత్నం చేసిన నిందితుడు, బిహార్ ముఠా సభ్యులమంటూ చెప్పి పోలీసు యంత్రాంగాన్ని హడలెత్తించి పరుగులు పెట్టించిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో చోటు చేసుకున్నది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దుబ్బాక గ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి 11 గంటలకు రెంజల్ మండలం దూపల్లికి చెందిన ఆలూర్ సంతోష్రెడ్డి అనే దుండగుడు చోరీకి యత్నించాడు. బ్యాంకు షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లడంతో సైరన్ మోగింది. ఆ సమాచారం మేనేజర్, డిప్యూటీ మేనేజర్కు వెళ్లడంతో హుటాహుటిన బ్యాంకు వద్దకు చేరుకున్నారు. షట్టర్ కొద్దివరకు లేచి ఉండడంతో దొంగలు పడ్డట్లుగా భావించి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. గ్రామస్తులంతా కలిసి షట్టర్ను మూసివేశారు. సమాచారం అందుకున్న ఎస్సై వంశీకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
షట్టర్ బయటి నుంచే నిందితుడితో ఎస్సై మాట్లాడే ప్రయత్నం చేయగా తనతోపాటు బిహార్కు చెందిన ఏడుగురు ఉన్నట్లు తెలపడంతో పోలీసులు హడలెత్తిపోయారు. తమ వద్ద ఉన్న సిబ్బందితో దుండగులను పట్టుకోలేమని భావించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో సిరికొండ, ఇందల్వాయి పోలీస్ స్టేషన్ల నుంచి మరికొంత మంది సిబ్బంది వచ్చారు. వారందరి సహకారంతో బ్యాంకు షట్టర్ తీయగా లోపల ఒక్కడే ఉన్నాడు. దీంతో నిందితుడిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఏసీపీ కిరణ్కుమార్ మంగళవారం ఉదయం బ్యాంకును పరిశీలించారు. క్లూస్టీమ్ వచ్చి వివరాలు సేకరించింది. నిందితుడికి మేనత్త వరుస అయిన లక్ష్మి దుబ్బాకలో ఉంటుందని, గతంలో ఇక్కడ డ్రైవర్గా పనిచేసినట్లు గ్రామస్తులు తెలిపారు.