నందిపేట్, ఏప్రిల్ 29 : మద్యం మత్తులో ఆరు నెలల పసిపాపపై తల్లి పైశాచికంగా ప్రవర్తించింది. పీకల దాకా మందు తాగి తన ఒడిలో ఉన్న తన బిడ్డను తీవ్రంగా కొట్టుకుంటూ భిక్షాటన చేసింది. గమనించిన మహిళలు దేహశుద్ధి చేసి ఆమెను పోలీసులకు అప్పగించారు. వివరాలు.. నందిపేట్ బస్టాండ్ వద్ద సోమవారం ఓ యాచకురాలు తన బిడ్డను చంకలో వేసుకుని భిక్షాటన చేసింది. ఎవరైనా భిక్షం వేయకపోతే తన చంటి బిడ్డను ఇష్టమొచ్చినట్లు కొడుతూ మూర్ఖంగా ప్రవర్తించింది. అప్పటికే పసిపాప కాళ్లకు గాయాలై కట్లు కట్టి ఉన్నాయి. మద్యం మత్తులో పాపను కొట్టడమే కాకుండా డబ్బులు లేవన్నందుకు అక్కడున్న దుకాణాల్లో గందరగోళం సృష్టించింది. బస్టాండ్ వద్ద ఉన్న మహిళలు పాపను తీసుకొని మద్యం మత్తులో ఉన్న తల్లిని చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తల్లిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. పసిపాపకు సపర్యలు చేసేందుకు ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ముందుకు రావడంతో పోలీసులు వారి వద్ద ఉంచినట్లు తెలిసింది.