కంఠేశ్వర్, జనవరి 31 : సమాజానికి పెను ప్రమాదంగా మారిన మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో మరింతగా గట్టిగా పనిచేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించగా సీపీ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లాలో మాదకద్రవ్యాల తయారీ, వాటి వినియోగం, రవాణా తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించి, వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకుకొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత, విద్యార్థుల భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానాకి కలిసికట్టుగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
మాదకద్రవ్యాలకు అలవాటు పడి వాటికి బానిసలుగా మారిన వారు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నష్టపోవడమే కాకుండా సమాజానికి కూడా హానీకారకులుగా మారుతారన్నారు. సీపీ కల్మేశ్వర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిరోధానికి పోలీసుశాఖ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మకరంద్, అదనపు డీసీపీ జయరాం, ట్రైనీ ఐపీఎస్ చైతన్య, ఆర్డీవో రాజేంద్రకుమార్, రాజాగౌడ్, వినోద్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి వాజిద్హుస్సేన్, డీటీసీ వెంకటరమణ, ఐబీ అధికారి ప్రసాద్, విద్య, వైద్య, అటవీ, రవాణా, వాణిజ్య పన్నులు ఔషధ నియంత్రణ శాఖాధికారులు పాల్గొన్నారు.