ఆర్థికంగా ఎదగాలంటే బాగా చదివి ఉద్యోగాలే చేయాల్సిన అవసరం లేదని, కొద్దిగా కష్టపడేతత్వం, మరికొంత పెట్టుబడి ఉంటే సరిపోతుందని నిరూపించారు ఈ దంపతులు. పాడి పరిశ్రమలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉత్తమ పాడి రైతులుగా అవార్డులను సొంతం చేసుకొని సన్మానాలు, సత్కారాలు, మన్ననలు పొందుతున్న దంపతులపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన దంపతులు పైడి జ్యోతీచిన్నయ్య ఇంటర్ వరకు చదువుకున్నారు. ఉద్యోగం దొరకదని బాధపడకుండా ఏదైనా మంచి పనిచేయాలనే ఆలోచనతో వారు మొదట పౌల్ట్రీ ఫాంను ఇంట్లోనే ఏర్పాటు చేసి నాలుగేండ్లు కోడి పిల్లలను పెంచడం మొదలుపెట్టారు. కానీ కోడిపిల్లలకు రోగాలు ఎక్కువ రావడం, అవి మృత్యువాత పడడంతో నష్టాలపాలయ్యారు. పెట్టిన పెట్టుబడి రాక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో భర్త చిన్నయ్య, అత్త,మామలతో ఆలోచించి పాడి పరిశ్రమ వైపు మొగ్గుచూపారు. గతంలో అత్త, మామ పైడి జానకీ, జనార్దన్ నాలుగు పశువుల పెంపకంతో కొంతమేర డబ్బులు సంపాదించేవారు. వారిని స్ఫూర్తిగా తీసుకున్న భార్యాభర్తలు జ్యోతీచిన్నయ్య.. ఇద్దరూ కలిసి పశు సంపద ద్వారా ఆర్థిక వృద్ధి సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అదే సంకల్పంతో ఇంటి ముందు రేకులతో షెడ్డు వేసి మేలుజాతి ఆవులు, బర్రెలను కొనుగోలు చేశారు.
రోజుకు 240 లీటర్లు..
ఇందులో హెచ్ఎఫ్, జెర్సీ, ముర్రా తదితర జాతులకు చెందిన, ఆవులు, బర్రెలు ఉన్నాయి. మొత్తం పశువులు 26 వరకు ఉండగా, అందులో 16ఆవులు, 10 బర్రెలు ప్రస్తుతం పాలిస్తున్నాయి. ప్రతి రోజూ 240లీటర్ల ఆవుపాలను అడ్లూర్ ఎల్లారెడ్డి విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి అందజేస్తున్నారు. బర్రెపాలను ఇంటి అవసరాలకు, ఇతరులకు విక్రయిస్తారు. పాల విక్రయంతో రోజుకు రూ.8వేల వరకు ఆదాయం వస్తున్నది. ఖర్చు, దాణా, గడ్డీ ఇతరత్రా వాటికి రూ.4,500 పోగా రూ.3500 ఆదాయం సంపాదిస్తున్నారు.
సొంత పొలంలో గడ్డి పెంపకం..
జ్యోతీచిన్నయ్యలకు ఉన్న 6ఎకరాల వ్యవసాయ భూమిలో నాలుగు ఎకరాల్లో గడ్డి జాతులైన సూపర్ నేపీయార్, రెడ్ నేపీయార్, స్మాట్ నేపీయార్, ప్యారా గడ్డి, హెడ్జ్ న్యూసరన్ తదితర హైబ్రిడ్ జాతి గడ్డిని పెంచుతున్నారు. ప్రతిరోజూ మిషన్ ద్వారా కటింగ్ చేసిన గడ్డిని, దాణాను పశువులకు పాకలో ఏర్పాటు చేసిన కుండీల్లో వేస్తారు. ఆవు, బర్రె పాలను ఉదయం, సాయంత్రం పూట మిషన్ల సహాయంతో సేకరిస్తారు. పశువుల కొట్టంలో ఉదయం 4 గంటలకే భక్తి గీతాలను వినిపిస్తూ పాలను సేకరించడం విశేషం. ఉదయం, సాయంత్రం పశువులను నీటితో శుభ్రంగా కడిగి ఉంచుతారు. పశువులను బయట తిప్పకుండా పాకలో మాత్రమే ఉంచుతారు. దీంతో పాలు ఎక్కువ ఇస్తాయని చెబుతున్నారు.
అవార్డు రావడం సంతోషకరం..
నేను ఇంటర్ చదివాను. ఈ చదువుతో ఎలాంటి ఉద్యోగం రాదని బాధపడకుండా భర్త చిన్నయ్య, అత్త,మామ సహాయంతో పాడిపరిశ్రమపై మక్కువ పెంచుకున్నాను. హెచ్ఎఫ్, జెర్సీ, ముర్ర తదితర మేలు జాతి పాడి పశువులను కొనుగోలు చేసి వాటి ద్వారా సంతాన ఉత్పత్తిని పెంచాము. ప్రతి రోజూ విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి 240లీటర్ల పాలను పోస్తాను. 2015లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు అందజేశారు. ఇటీవల తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో కామారెడ్డి విజయ డెయిరీలో ఉత్తమ పాడి రైతు అవార్డు అందజేశారు. విజయ డెయిరీ అధికారుల కృషి, పశువైద్యుల సహకారంతో పాడి పరిశ్రమలో రాణిస్తున్నాను. పాడిపరిశ్రమలో రాణిస్తున్న మహిళలకు తెలంగాణ ప్రభుత్వంలోనే అవార్డులు వచ్చాయి. మహిళల స్వశక్తిని గుర్తించి అవార్డులు ఇచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– పైడి జ్యోతి, పాడి రైతు,అడ్లూర్ ఎల్లారెడ్డి
రుణాలు.. సబ్సిడీ
పశువుల కొనుగోలు కోసం ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా రుణం తీసుకున్నారు. రూ.50వేల వరకు నాబార్డు నుంచి సబ్సిడీ కూడా వచ్చింది. పశుక్రాంతి పథకం ద్వారా రెండు ఆవులను సబ్సిడీపై తీసుకున్నారు. గత నెలలో విజయ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అడ్లూర్ ఎల్లారెడ్డి ద్వారా స్త్రీనిధి కింద రెండు బర్రెలను కూడా కొనుగోలు చేశారు. పశువులకు ఎలాంటి వ్యాధులు వచ్చినా పశువైద్యులు సూచించే మందులను వాడుతూ వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పాలు సేకరించేందుకు రూ.80వేలతో ప్రత్యేక మిషన్ను కొనుగోలు చేశారు. రూ.18వేలతో గ్రాస్కట్టర్, రూ.90వేలతో గడ్డి మిషన్ను కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో ఆవు ధర రూ.లక్ష వరకు పలుకుతున్నది. ప్రతి ఆవు పూటకు 8-10 లీటర్లు, రెండు పూటలు కలిపితే 18-30 లీటర్ల వరకు పాలిస్తున్నాయి.
మహిళలు ముందుకు రావాలి..
నేటితరం మహిళలు పశు పోషణలో ముందు కు రావాలి. మహిళలకు తెలంగాణ ప్రభు త్వం విజయ డెయిరీ ఆధ్వర్యంలో చేయూతనందిస్తూ ప్రోత్సహిస్తున్నది. విజయ డెయిరీలో ప్రతిరోజూ పాలను పోస్తూ జిల్లాలోనే ఉత్తమ మహిళా పాడి రైతుగా పైడి జ్యోతీచిన్నయ్య చాలాసార్లు అవార్డు సాధించారు. ప్రతిమహిళా పైడి జ్యోతిని ఆదర్శంగా తీసుకోవాలి.
– యాడారం రమేశ్, బీఎంసీ మేనేజర్, అడ్లూర్ఎల్లారెడ్డి
పశుపోషణలో జిల్లాలోనే ఆదర్శం..
పైడి జ్యోతీచిన్నయ్య పశు వైద్యుల సలహా, సూచనల మేరకు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పశుపోషణ చేపడుతున్నారు. పాడి అభివృద్ధిలో మహిళా రైతు అయిన జ్యోతీచిన్నయ్య జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు.
– జుగల్ కిశోర్, పశుగణన సహాయకుడు, అడ్లూర్ ఎల్లారెడ్డి
సాధించిన అవార్డులు