డిచ్పల్లి, ఫిబ్రవరి 2 : బెంచీపై కూ ర్చునే విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణాలను బలిగొన్నది. డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఈ ఘటన చోటు చేసుకున్నది. పోలీసులు, మృతుడి కుటుంబీకులు, పాఠశాల సిబ్బంది కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గౌతంనగర్కు చెందిన షేక్ సోఫియాన్(14) గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
గురువారం ఎప్పటిలాగే మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థులంతా మెస్కు చేరుకున్నారు. సోఫియాన్తో పాటు అతడి క్లాస్మేట్ ప్లేట్లలో భోజనం తీసుకుని, డైనింగ్ టేబుల్ వద్దకు చేరుకున్నారు. నేను ముందు వచ్చాను అంటే నేను వచ్చానని కూర్చునే విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. ఆవేశానికి లో నైనా తోటి విద్యార్థి పిడికిలి బిగించి సోఫియాన్ ఛాతిపై బలంగా కొట్టడంతో అతడు కుప్పకూలి పోయాడు. అక్కడే ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు సోఫియాన్ను లేపేందుకు య త్నించగా, అప్పటికే అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆందోళనకు గురైన టీచర్లు ప్రిన్సిపాల్ జమీల్కు తెలిపారు.
వెంటనే సోఫియాన్ను జిల్లా దవాఖానకు తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో ఉపాధ్యాయులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వస్తే తమపై దాడి చేస్తారేమోననే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దవాఖానకు చేరుకున్న సోఫియాన్ తల్లి, బంధువులు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యార్థి మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది భిన్నమైన కారణాలు చెప్పడంతో బంధువులు దవాఖాన వద్ద ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్తో సహా బాధ్యులైన సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్పల్లి ఎస్సై కె.గణేశ్ తెలిపారు. గురుకులం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.