నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 23: నిజామాబాద్ నగరంలో రెండు గ్యాంగుల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలో సంధి కుదిర్చేందుకు వెళ్లిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అఫ్జల్ అనే యువకుడు నిజామాబాద్లోని బాబన్ సహాబ్ పహాడ్ ప్రాంతం మీదుగా శనివారం కారు నడుపుకొంటూ వెళ్లాడు. కారు నీటిలో నుంచి వెళ్లడంతో రోడ్డు పక్కనే ఉన్న హజీపై బురద పడింది. దీంతో ఆగ్రహించిన హాజీ.. అప్జల్పై దుర్భాషలాడాడు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.. ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు నగరంలోని వినాయక్నగర్కు చెందిన అర్భాజ్ఖాన్ ఆదివారం మధ్యాహ్నం అసద్బాబా నగర్ ఏరియాకు వెళ్లాడు.
అక్కడ ప్రత్యర్థి గ్యాంగ్తో మాట్లాడుతున్న క్రమంలో హాజీ, అతడి చిన్నమ్మ కుమారుడు సోహెల్తో పాటు సర్పరాజ్, సయ్యద్ ఖాన్, హుస్సేన్ మరికొంత మంది కలిసి అర్భాజ్ఖాన్(18)పై కత్తులతో దాడిచేశారు. దీంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దాడి సమయంలో అడ్డు వెళ్లిన అజార్పై సైతం కత్తితో దాడిచేయగా.. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి తల్లి ఆసియా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఐదో టౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై డి.సాయినాథ్ తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఘటన జరిగిన ఏరియాలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.