కంఠేశ్వర్, మార్చి 11 : నగరంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్తోపాటు నగరపాలక కమిషనర్ మకరంద్, ట్రైనీ ఐఏఎస్ కిరణ్మయికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
ఆర్మూర్లో ఉన్న టీఎస్డబ్ల్యూఆర్ఐఈఎస్ రోగాలకు నిలయంగా మారిందని నాగరాజు అనే వ్యక్తి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. బాత్రూమ్లు కంపుకొడుతున్నాయని, పిల్లల డార్మెటరీ రూమ్లు, బాత్రూమ్లు ఒకే భవనంలో ఉండడం వలన అపరిశుభ్రత కారణంగా పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయామై ప్రిన్సిపాల్ను సంప్రదించగా.. దురుసుగా మట్లాడుతున్నాడని ఫిర్యాదు చేశాడు.
ప్రభుత్వ దవాఖాన ఎదుట పార్కింగ్ చేసిన తన బైక్ ఇటీవల పోయిందని, ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించకపోవడంతోనే తన బైక్ దొరకలేదని జిల్లాకేంద్రంలోని సాయినగర్కు చెందిన సుధాకర్ అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ ఫుటేజీలో బైక్ను చోరీ చేస్తున్న దృశ్యాలు రికార్డయినా దొంగలను పట్టుకోలేదని, పోలీసుల నిర్లక్షం పోలీసుల నిర్లక్ష్యంతోనే తన బైక్ దొరకలేదని, తన బైక్ను పట్టుకొని, అప్పగించాలని కోరారు.
పెండ్లయి కుమారుడు పుట్టిన తర్వాత నరాల సంబంధిత వ్యాధితో తన కూతురు స్రవంతి బాధపడుతున్నదని, ఆదుకోవాలని గాజులపేట్కు చెందిన ఆమె తండ్రి దేవారెడ్డి అధికారులకు విన్నవించాడు. ఐదేండ్లుగా మంచానికే పరిమితమైందని, కూలీ పని చేసుకొని బతికే తమకు కనీసం మందులు కొనే పరిస్థితి లేదని విన్నవించాడు. అధికారులు స్పందించి తమ కూతురు ఆరోగ్యం బాగయ్యేలా చూడాలని కోరాడు. తన కూతురిని చేతులపై ఎత్తుకొని రావడం అక్కడ ఉన్న వారిని కలిచివేసింది.