నిజామాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మొన్నీమధ్యే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఎంబీబీఎస్ చదివే ఓ విద్యార్థి బలవన్మరణం చెందాడు. మెడికల్ కళాశాలలో అత్యున్నత నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన సదరు యువకుడు క్షణికావేశంలో తన ముందు నిలిచిన కష్టాన్ని జయించలేక ఆత్మహత్యకు ఒడిగట్టాడు. కొద్ది నెలలైతే తాను కలలుగన్న డాక్టర్ చదువు పూర్తయ్యేది. కుటుంబ సభ్యుల కలలు అన్నీ నెరవేరేవి. అవేవి ఆలోచించకుండా మధ్యలోనే ఊపిరి తీసుకోవడంతో తనపై ఆధారపడిన తల్లిదండ్రులు రోడ్డున పడే పరిస్థితి ఎదురైంది. ఈ ఘటన మరువక ముందే నిజామాబాద్ మెడికల్ కాలేజీలోనే ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువకుడు తనువు చాలించాడు. క్షణికావేశంలో యువత తమ ప్రాణాలను తీసుకొని తమపై ఆధారపడిన వాళ్లందర్ని ఒంటరి చేసి వెళ్లిపోతున్నారు. రెండు నెలల క్రితం భర్తను కోల్పోయిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నెలన్నర క్రితం బాసరలోని గోదావరి నదిలో దూకి తనువు చాలించింది. తనతో పాటు పేగు తెంచుకొని పుట్టిన పిల్లలను సైతం గోదావరిలో తోసేసి తాను బలైంది. ఇలా ఒకరు కాదు… ఇద్దరు కాదు… వందలాది మంది ప్రతి ఏటా ప్రాణం తీసుకుంటూ కుటుంబాలను ఒంటరి చేస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉంటుండడం ఆందోళన కలిగిస్తున్న మరో అంశం. చెడు వ్యసనాలకు బానిసై, ప్రేమ వ్యవహారాల్లో చులకనై, ఆర్థికపరమైన కష్టాల్లో కూరుకుపోయి బయటపడలేక ప్రాణాన్నే పణంగా పెడుతున్నట్లుగా అవగతం అవుతున్నది.
కష్టాన్ని ఎదురించలేక…
ప్రపంచంలో అన్నింటికన్నా విలువైంది మానవ జీవతమే. అయితే జీవితంలో వైఫల్యాలు సాధారణం. బతికి ఉంటే దేన్నైనా సాధించగలం. కానీ పోయిన ప్రాణాన్ని తీసుకువచ్చే శక్తి దేనికీ లేదు. ఇంతటి విలువైన ప్రాణాలను చిన్నాచితక కారణాలతో చాలించుకోవడం సరికాదు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలనుకోవడంలో తప్పులేదు. కానీ అదే సర్వస్వం అన్న భావనను మనసులో నుంచి తొలగించుకోవాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉందనే విషయాన్ని మరిచి బలవంతంగా ప్రాణాన్ని తీసుకోవడం కన్నా వారికి, మన మీద ఆధారపడ్డ వారికి క్షోభను మిగల్చడమే. బతికి సాధిద్దాం… అనే సంకల్పం ఉంటే ఒత్తిళ్లు, ఎంతటి ప్రతికూలతలనైనా మనకు అనుకూలంగా మార్చుకొని ముందుకు సాగితే జీవితం పూలబాటే అవుతుంది. ఆత్మహత్యలు పెరగడానికి ప్రస్తుత ఆధునిక జీవన విధానం కూడా కారణమవుతున్నది. ఒకప్పటి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో అనునయించే వారు లేక కష్టాలు వస్తే తట్టుకోలేకపోతున్నారు. పిల్లలకు మంచి చెడు చెప్పి ఆత్మైస్థెర్యం నింపేవారు కరువయ్యారు. తమ పిల్లలు ఇలా ఉండాలి. ఇలాంటి చదువులు చదవాలి. ఈ ఉద్యోగం మాత్రమే చేయాలి అన్న భావనతో ఉన్నతంగా ఊహించుకొని మార్కులు, ర్యాంకులు రావాలని చూస్తున్నారే తప్ప వారిలో మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించడం లేదు.
గతేడాది 682 ఆత్మహత్యలు…
చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి కేవలం ఒత్తిళ్లను జయించలేక నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగిస్తున్నారు. ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు. నేటి సమాజంలో ఉన్నత చదువులు చదివిన విద్యార్థుల్లో ఇలా ఆందోళనకు గురవుతున్న వారు ఎందరో. కరోనా తర్వాత ఇలాంటి విపరీత ధోరణులు మరింత పెరుగుతూ వస్తున్నాయి. ఉద్యోగం సాధించకపోతే సమాజం తమను చిన్నచూపు చూస్తుందన్న భయం. తల్లిదండ్రులు, కుటంబ సభ్యులు తమపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేకపోతున్నామన్న ఆందోళన. ఇలా కారణాలు ఏమైనా ఆత్మహత్యలకు పాల్పడడం వారి కుటుంబ సభ్యులను తీరని వేదనకు గురి చేస్తుండగా మరోవైపు సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆత్మహత్యల గణాంకాలు భయపెడుతున్నాయి. 2020లో 343 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2021లో 355 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. 2022లో 292 మంది ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసుల గణాంకాలు చెబుతున్నారు. అయితే 2022లో కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 390 మంది ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బలవన్మరణానికి పాల్పడిన వారి సంఖ్య 682 మందికి చేరడం దురదృష్టం.
ఆత్మైస్థెర్యమే ఆయుధం…
ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత చదువుల వరకు పిల్లలపై ఒత్తిడి ఉంటుంది. దీనికి తోడు ఏదైన సమస్య వస్తే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం కారణంగా తమ సమస్యలను పంచుకునే వారు కరువయ్యారు. ఇది విపరీత పరిణామాలను దారి తీస్తోంది. తమ పిల్లల సామర్థ్యాలను అంచనా వేయకుండా ఉన్నత రంగాల్లో ఉండాలనే ఏకైక లక్ష్యంతో చిన్ననాటి నుంచే వారి లక్ష్యాలను తల్లిదండ్రులే నిర్ధేశించడం, అందులో విఫలం అయితే జీవితం లేదన్నట్లు ప్రవర్తించడం దుష్పరిణామాలకు కారణం అవుతున్నది. దీంతో చిన్నాచితక కారణాలకే కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సరైన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో ఆత్మైస్థెర్యం నింపేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. విలువల విద్య, జీవన నైపుణ్యాలు, నైతికత, మానవ విలువలు వంటివి పాఠ్యాంశాలుగా కొన్ని తరగతుల్లో ప్రవేశ పెట్టినా వాటిని నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే ప్రతి విద్యార్థికి వాటిని చదివేలా మిగతా సబ్జెక్టులకు ఇచ్చిన విధంగా ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటితో జీవన నైపుణ్యాలు, ఆత్మైస్థెర్యం పెంపొందించుకొనే అవకాశం ఏర్పడుతుంది. పరీక్షలు, చదువంటే భయం, తరచూ మనసుకు ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
సంతోషాన్ని ఆస్వాదిస్తున్నారు… కష్టాన్ని తట్టుకోలేకపోతున్నారు…
కోపం, అసహ్యం, భయం, అసూయ, ఆనందం, బాధ, ఆశ్చర్యం ఇలాంటి పరిస్థితులతో మనుషుల్లో భావోద్వేగాలు ఉత్పన్నం అవుతాయి. ఉగాది పచ్చడి లాంటి ఇలాంటి వాటన్నింటినీ ఆస్వాదించాలి. పాత కాలంలో వీటన్నింటినీ అనుభవించారు. గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానిప్పటి తరంలో భావోద్వేగాలను ఎదుర్కోలేకపోతున్నారు. తమకు ఇష్టమైన విషయాలను ఎంజాయ్ చేస్తున్నారు. స్నేహితులతో జల్సాలు, పార్టీలకు హాజరవ్వడం. అదే కష్టం వస్తే దూరం ఉంటున్నారు. ఉదాహరణకు పని చేయడం, చదవడం, పరీక్షలను ఎదుర్కోవడం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా ధైర్యంగా ఉండే విధంగా ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే పాఠ్యాంశంగా మార్చడం మంచిది. దీని వల్ల మంచి ప్రయోజనం దక్కుతుంది. ఉమ్మడి కుటుంబం మన సమాజంలో అద్భుతమైన ఫలితాలు తీసుకు వచ్చింది. పట్టణీకరణలో కుటుంబం విచ్ఛిన్నం కావడంతో వేర్వేరు జీవితాలు మొదలై ఒంటరి బతుకును వెళ్లదీస్తున్నారు. కష్టం, సుఖంలో దగ్గరి వ్యక్తులు లేకపోవడం సమస్యగానే మారుతున్నది.
– ప్రొఫెసర్, డాక్టర్ ఆకుల విశాల్, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు