టీచర్ పోస్టుల ఖాళీల లెక్క తేలింది.. ఉమ్మడి జిల్లాలో 509 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. దీంతో నిరుద్యుగుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. జీవో 317 ద్వారా సొంత జిల్లాలకు బదిలీ చేయడం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్ధుబాటు చేయడంతో నిజామాబాద్ జిల్లాలో 309, కామారెడ్డిలో 200 పోస్టులు ఖాళీ అయ్యాయి. ఆయా పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. పోస్టుల భర్తీని జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా నిర్వహించనున్నారు. ఏడాది కాలంగా వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తుండడంతో నిరుద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కామారెడ్డి (నమస్తే తెలంగాణ)/ ఖలీల్వాడి, ఆగస్టు 25 : రాష్ట్ర ప్రభుత్వం టీచర్ కొలువులను భర్తీ చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వెల్లడించనున్నది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టెట్ పాస్ అయి ఉన్నవారు ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. టీచర్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. చైర్మన్గా జిల్లా కలెక్టర్, వైస్ చైర్మన్గా అదనపు కలెక్టర్, కార్యదర్శిగా డీఈవో, సభ్యుడిగా జిల్లా పరిషత్ సీఈవో కమిటీ నియామకాలను చేపడుతుందని వివరించారు. 2017లో టీఆర్టీ ద్వారా ఉమ్మడి నిజామాబాద్లో 1,377 పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుతం జిల్లా సెలక్షన్ కమిటీ డీఎస్సీ నిర్వహించనున్నది.
ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టడంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. టెట్ పరీక్షకు ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించగా, అందులో క్వాలిఫై అయిన వారు.. గతంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు సిద్ధ్ధమవుతున్నారు. సొంత జిల్లాలో ఉద్యోగం సాధించేందుకు ఇప్పటినుంచే హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో చేరారు. ప్రభుత్వం ఏడాది కాలంగా వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తుండడంతో నిరుద్యోగులు సంతోషిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 309 పోస్టులు..
నిజామాబాద్ జిల్లాలో 309 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 96, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 183, లాంగ్వేజ్ పండిట్ 21, పీఈటీ 9 మొత్తం 309 పోస్టులు భర్తీ కానునాయి. రాష్ట్రప్రభుత్వం రెండు రోజుల్లో నోటిఫికేషన్ వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పడంతో నిరుద్యోగ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో 200 పోస్టులు
కామారెడ్డి జిల్లాలో 317 జీవో ద్వారా సొంత జిల్లాలకు టీచర్లను బదిలీ చేయడం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించిన తర్వాత జిల్లాలో 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ అధికారులు నివేదిక అందించారు. స్కూల్ అసిస్టెంట్ 97, సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) 86, లాంగ్వేజ్ పండిట్స్ 12, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 5 పోస్టులను భర్తీ చేయనున్నారు.
టెట్ పాసైన వారు బాగాచదువుకోవాలి
నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. టెట్ పాసైన వారు ఉద్యోగం సాధించేలా కష్టపడి చదవాలి.
– దుర్గాప్రసాద్, నిజామాబాద్ డీఈవో
నిరుద్యోగులకు అండగా ప్రభుత్వం
నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అనేక నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. త్వరలో డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేయనుండడంతో ఇప్పటి నుంచే ఉద్యోగం సాధించేలా కష్టపడతాం. డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీతో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయి.
-వెంకటేశం, ఎల్లారెడ్డి
కేసీఆర్ సార్కు ధన్యవాదాలు
సీఎం కేసీఆర్ సార్ నిరుద్యోగుల గురించి ఎంతో ఆలోచిస్తున్నారు. అనేక పోస్టులను భర్తీ చేస్తున్నారు. 2017లో టీఆర్టీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వేయనుండడం సంతోషకరం. నిరుద్యోగులు కష్టపడి ఉద్యోగం సాధించాలి.
– ఎండీ రెహాన్, డీఎస్సీ అభ్యర్థి, బస్వాయిపల్లి