అందుబాటులో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు
కామారెడ్డి జిల్లాలో 44 క్రీడా ప్రాంగణాలు ప్రారంభం
సద్వినియోగం చేసుకుంటున్న ఉద్యోగార్థులు
ప్రతిచోటా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్టులు
జిల్లా వ్యాప్తంగా 406 గ్రామాల్లో క్రీడాస్థలాల గుర్తింపు
కామారెడ్డి, జూన్ 22: ఉమ్మడి రాష్ట్రంలో నిధుల్లేక నీరసించిన పల్లెలు.. నేడు శాశ్వత వనరులతో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే పల్లెల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, నర్సరీల సరసన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు చేరాయి. క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు.. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫిట్నెస్ కోసం రోడ్లవెంట పరుగులు తీసే బాధలేకుండా, ప్రాక్టీస్ కోసం ఖాళీ జాగా కోసం కష్టపడకుండా అరఎకరం నుంచి ఒకటిన్నర ఎకరం వరకు స్థలాలను ఎంపిక చేశారు.
కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాస్కెట్బాల్ తదితర కోర్టులతోపాటు వ్యాయామానికి లాంగ్బార్ సింగిల్, డబుల్ స్తంభాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 44ప్రాంగణాలను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చారు. అక్కడక్కడా పోలీస్ ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవడం మొదలైంది. మిగతా చోట్ల ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. యువత, విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం పెంచడం, ఉద్యోగార్థులకు క్రీడా ప్రాంగణాలు దోహదం చేసేలా ప్రభుత్వం కసరత్తు చేపట్టింది.
15 రోజుల్లోనే క్రీడా ప్రాంగణాలు
క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు సంకల్పించిన 15రోజుల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లాలో 44 ఆట స్థలాలను సిద్ధం చేశారు. సర్కార్ ఆదేశాల మేరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన జిల్లా పరిధిలో 44 క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ఒక్కో ఆవాస గ్రామంలో అర ఎకరం నుంచి ఎకరం వరకు, గ్రామ పంచాయతీ పరిధిలో ఎకరం నుంచి ఒకటిన్నర ఎకరం వరకు భూమిని గుర్తించి క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాల్టీలతోపాటు గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. జిల్లా పరిధిలో 678 గ్రామపంచాయతీ, ఆవాస కేంద్రాలుండగా, 406 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు అనువుగా స్థలాలను గుర్తించారు. ఇప్పటి వరకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. జూన్ 2వ తేదీ నాటికే 29ఖోఖో, 29 వాలీబాల్, 29 సింగిల్,డబుల్ బార్ స్తంభాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన లేఅవుట్ ప్రకారం క్రీడా మైదానాన్ని తయారు చేయడంతోపాటు హరితహారం మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. రూ.2లక్షల నుంచి రూ.4.50లక్షలు వెచ్చించి క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దారు. క్రీడా ప్రాంగణాల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రతి మం డలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు.
ఉద్యోగార్థులకు ఉపయుక్తం..
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెద్ద ఎత్తున పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసింది. సివిల్, ఏఆర్ కానిస్టేబుల్, ఎస్సై, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణా శాఖలకు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేస్తుండడంతో ఉద్యోగార్థులు సన్నద్ధమవుతున్నారు. పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పల్లెలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను వ్యాయామం, రన్నింగ్కు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పల్లెప్రగతి పనులు కొనసాగుతుండడంతో క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు కాస్త ఆలస్యం అవుతుండగా.. ఈ నెలలో ఆట స్థలాలపైనే పూర్తిగా దృష్టి సారించనున్నారు. ప్రతి ప్రాంగణంలో కోర్టుల ఏర్పాటు ఉపాధి హామీ పథకం కింద పూర్తి చేసి,గ్రామ పంచాయతీ నిధులతో స్తంభాలు, గేట్ నిర్మాణం, ఆర్చ్, నేమ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాలీబాల్, బాస్కెట్ బాల్ కిట్లతోపాటు క్రీడాకారులకు టీ షర్ట్స్ ఉచితంగా అందజేయనున్నది.
క్రీడలకు పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేసేందుకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 44 క్రీడాప్రాంగణాలు ప్రారంభం కాగా 42 పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. మరో 103 ప్రాంగణాలకు అనుమతులు తీసుకున్నాం. వీటిని దశల వారీగా పూర్తి చేస్తాం. ఒక్కో క్రీడా ప్రాంగణంలో చేపడుతున్న పనుల మేరకు నిధులు విడుదలవుతున్నాయి. యువత, విద్యార్థులు శారీరక దారుఢ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు క్రీడా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకోవాలి.
–సాయన్న, డీఆర్డీవో, కామారెడ్డి