నాన్ కమాండ్ ఏరియా ఇక పచ్చబడనున్నది. నీళ్లు లేక పడావుగా మారిన జుక్కల్ నియోజకవర్గంలో పచ్చదనం పరుచుకోనున్నది. నాలుగు మండలాల్లోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.476.25 కోట్ల వ్యయంతో నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ఎత్తిపోతల పథకాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం రైతులకు అంకితం చేయనున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి ఆయన నిజాంసాగర్కు రానున్నారు. మంజీరాపై రూ.25 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని కేటీఆర్ ప్రారంభించనున్నారు. పిట్లం బహిరంగ సభలో పాల్గొననున్నారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే హన్మంత్ షిండే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
నిజాంసాగర్, మార్చి14 : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం పర్యటించనున్నారు. పిట్లం, నిజాంసాగర్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
ఏండ్ల కల సాకారం..
ఎన్నో సంవత్సరాల నుంచి నాన్కమాండ్ ప్రాంతానికి నిజాంసాగర్ నీటిని అందించాలని, జుక్కల్ నియోజకవర్గంలో ఒక్క ఎకరం ఎండిపోకుండా చూడాలంటూ ప్రతి నిత్యం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే పరితపించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో నాన్కమాండ్ ఏరియాకు సాగు నీరు కావాలని తన గొంతు వినిపించేవారు. కానీ పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రతి ఎకరాకూ సాగు నీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. దీంతో ఎమ్మెల్యే హన్మంత్షిండే నాగమడుగు మత్తడి నిర్మిస్తే జుక్కల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 40వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని..
నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే సీఎం కేసీఆర్ సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు రూ.476.25 కోట్లు మంజూరు చేశారు. దీంతో నిజాంసాగర్ మండలంలోని వడ్డెపల్లి-కొమలంచ శివారులోని మంజీర పరివాహక ప్రాంతం లో పనులను చేపడుతుండడంతో నేడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నాగమడుగు మత్తడి నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.నియోజకవర్గంలోని నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, బిచ్కుంద మండలాల రైతులకు మత్తడిని అంకితం చేయనుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముందుచూపుతో మంజీరపై వంతెన
నిజాంసాగర్ మండల కేంద్రం నుంచి పిట్లం, బిచ్కుం ద, మద్నూర్, కర్నాటక, నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ జాతీయ రహదారిపైకి వెళ్లాలంటే మంజీ రా నదిపై ఉన్న వంతెనే దిక్కు. అయితే ఈ వంతెన నిజాం నవాబులు సుమారు వంద ఏండ్ల కిందట ని ర్మించారు. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకున్నది. ప్రభుత్వం, ఎమ్మెల్యే హన్మంత్షిండే ముందు చూపుతో పాత వంతెన పక్కనే రూ.25 కోట్ల వ్యయంతో కొత్త వంతెనను నిర్మించారు. శిథిలావస్థకు చేరుకున్న వంతెన మరి కొన్ని సంవత్సరాల్లో కూలిపోతుందని అందరూ భావించారు. కానీ ఆరు నెలల కిందటే అది కూలిపోయింది. దీంతో నూతనంగా నిర్మించిన వంతెన పై నుం చే రాకపోకలు ప్రారంభించారు. ప్రభుత్వం ముందు చూపుతో నిర్మించడంతో నేడు ఇబ్బందు లు లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నామంటూ ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా నిర్మించిన వంతెనను సైతం నేడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నది
నాగమడుగు మత్తడి నిర్మాణంతో నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి గతంలో సింగూరు నీరు రాక ఎడారిగా మారేది. అలాంటిది సీఎం కేసీఆర్ కృషితో కాళేశ్వరం నీటిని నిజాంసాగర్కు తీసుకువచ్చారు. దీంతో నిజాంసాగర్ ప్రతి సంవత్స రం నిండిపోయి మిగులు జలాలు వరద గేట్ల ద్వారా మంజీరలో కలుస్తున్నాయి. దీంతో పాటు నల్లవాగు నీరు సైతం మంజీరలో వృథాగా ప్రవహిస్తుంది. వృథా నీటిని ఉపయోగంలోకి తీసుకువచ్చేలా నాగమడుగు మత్తడి నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉంది.
-వెంకట్రాంరెడ్డి, రైతు, అన్నారం, పిట్లం మండలం.
నాగమడుగుతో చెరువులన్నీ నిండుగా
నాగమడుగు మత్తడి నిర్మాణంతో నాన్ కమాండ్ ఏరియాలోని గ్రామాల్లో సైతం చెరువులన్నీ నీటితో కళకళలాడే రోజులు రానున్నాయి. రూ.476 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మత్తడిని నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనుండడంతో నియోజకవర్గ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇక మా ప్రాంతం సైతం రెండు పంటలతో కళకళలాడే రోజులు రానున్నాయి. కేసీఆర్ సార్ రైతుపక్షపాతి అని మరోసారి రుజువైంది.
-అశోక్, కుర్తి, పిట్లం మండలం
వంతెన నిర్మాణంతో దూరమైన బాధలు
నిజాంసాగర్ మండల కేంద్రంలో రూ.25 కోట్ల వ్యయంతో మంజీరపై వంతెనను నిర్మించారు. వంతెనను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. వంతెన నిర్మాణంతో మా బాధలు దూరం కానున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో భయంభయంగా ప్రయాణం సాగించాం. ఇక సాఫీగా ప్రయాణించే రోజులు వచ్చాయి.
-రాములు రాథోడ్, నిజాంసాగర్