కోటగిరి, ఆగస్టు 17: గూడులేని పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇండ్లను కట్టిస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువాడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వేల సంఖ్యలో డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయించారు. ఇందులో భాగంగా కోటగిరి మండలకేంద్రంలో 34 ఇండ్ల నిర్మాణం పూర్తికావడంతో ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు తదితర అభివృద్ధి పనులు సైతం చివరి దశకు చేరుకున్నాయి. స్పీకర్ పోచారం ప్రత్యేక పర్యవేక్షణ, నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహించి నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
34 ఇండ్లు ప్రారంభానికి సిద్ధం..
కోటగిరి గ్రామానికి పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటివరకు 290 కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశారు. అందులో 34 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తియ్యింది. ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను రెవెన్యూ అధికారులు ఎంపికచేశారు. డివిజన్, మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి 34 మందిని లబ్ధిదారులుగా గుర్తించి కొత్తగా నిర్మించిన ఇండ్లను కేటాయిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇండ్ల నిర్మాణం పూర్తికావడంతో లబ్ధిదారులు గృహప్రవేశం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్వరలోనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వీటిని అధికారికంగా ప్రారంభించనున్నారు.
మళ్లా కేసీఆర్ సారే సీఎం..
టీఆర్ఎస్ సర్కారు గరీబోళ్లను మంచిగ చూసుకుంటున్నది. వేరే పార్టీలు గెలిస్తే పేదోళ్లకు కష్టాలే. ఇప్పటి దాకా ఏ పార్టీలూ మాకు న్యాయం చేయలే. ఎన్ని పార్టీలు అడ్డం వచ్చినా పేదలకు మంచిచేస్తున్న కేసీఆర్ సారే మళ్లా సీఎం అయితడు.
– గాండ్ల సవిత, లబ్ధిదారు, కోటగిరి
పేదల మనిషి పోచారం సార్..
పేదలకోసం ఆలోచించే మనిషి పోచారం సారు. ఏండ్ల తరబడి గుడిసెల బతికినా ఎవ్వరూ పట్టించుకోలే. పోచారం సార్ మమ్మల్ని ఆదుకున్నరు. సొంత మనిషి లెక్క ఇల్లు కట్టించ్చిండ్రు. సీఎం, స్పీకర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటం.
– చాకలి రాజమణి, లబ్ధిదారు, కోటగిరి
మస్తు ఖుషీగా ఉంది..
పోచారం సాబ్ అచ్చా ఆద్మీ. గరీబోళ్లను బాగా చూసుకుంటున్నరు. మేము కిరాయికి ఓ పాత ఇంట్ల ఉండెటోళ్లం.వానలు పడితే ఇల్లాంతా ఉరుస్తుండె. సీఎం కేసీఆర్ సాబ్ పుణ్యమా అని డబుల్ బెడ్ రూం ఇల్లు వచ్చింది. మా కుటుంబం మస్తు ఖుషీగా ఉన్నది.
– జబీన్ సుల్తానా, లబ్ధిదారు, కోటగిరి
కిరాయితో తక్లీబ్ అయ్యింది..
మాది బీద కుటుంబం సారూ.. ఇల్లు లేదు.. ముగ్గురు పిల్లలతోని ఎన్నో ఏండ్లుగా కిరాయికి ఉంటున్నం.. వాళ్లు పెద్దగైన కొద్దీ ఖర్చులు పెరిగినాయి. కిరాయిలు కట్టుడు చాలా కష్టమైంది. సీఎం కేసీఆర్, మా పోచారం సాబ్ కొత్త ఇల్లు కట్టి ఇచ్చిండ్రు. వాళ్లను అల్లా సల్లంగ చూస్తడు.
– నుస్రత్బేగం, లబ్ధిదారులు, కోటగిరి
పేదలు గుండెల్లో పెట్టుకున్నరు..
ఇప్పటివరకు చూడని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంతో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని పేద ప్రజలు గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్నారు. గ్రామాల్లో స్పీకర్ పర్యటించినప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడి స్వయంగా వారి సమస్యలు, అవసరాలను తెలుసుకుంటారు. కోటగిరికి 290 ఇండ్లు మంజూరు కాగా, 34 పూర్తిచేశాం. మిగితావి త్వరలోనే నిర్మిస్తాం.
– పత్తి లక్ష్మణ్, సర్పంచ్, కోటగిరి