రుద్రూర్, ఫిబ్రవరి 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలోనే అత్యధిక డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కాసేపు చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.
అనంతరం రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పెరిక సంఘ భవన నిర్మాణ పనులకు సంఘం నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. అన్ని సంఘాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఇందులోభాగంగా రుద్రూర్లో ప్రతి కుల సంఘానికీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో పదివేల డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టించినట్లు తెలిపారు. సొంత స్థలంలో ఏడు వేలు, ప్రభుత్వ స్థలంలో మూడు వేల ఇండ్లను నిర్మించినట్టు చెప్పారు.
మండలాల వర్గీకరణ విషయంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజల సలహాల మేరకు నూతన మండలాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో రెండు హైవేలు కలిసే ఏకైక మండలం రుద్రూర్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మెదక్, బాన్సువాడ, రుద్రూర్, బోధన్ వరకు ఒక రోడ్డు, సిర్పూర్ పొతంగల్, రుద్రూర్, బోధన్ మీదుగా మరో ప్రధాన రోడ్డు నిర్మించడం ఆనందంగా ఉందన్నారు.
అన్ని మండలాలకు రుద్రూర్ కేంద్రమవుతుందన్నారు. త్వరలో రూ.3 లక్షల స్కీం రాన్నుట్లు, అందులో ఒక బెడ్రూం, ఒక బాత్రూం, కిచెన్, హాలు నిర్మించేలా ప్లాన్ను రూపొందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నారోజీ గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, పెరిక సంఘం రాష్ట్ర నాయకులు ప్రభాకర్, సుధాకర్, విండో చైర్మన్ సంజీవ్రెడ్డి, ఎంపీటీసీ సావిత్రి, కో-ఆప్షన్ మెంబర్ మస్తాన్, నక్క సాయిలు, కన్నె రవి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తొట్ల గంగారాం, పార్టీ మండల కార్యదర్శి బాలరాజు, ఏఈ నాగేశ్వర్రావు, తహసీల్దార్ ముజీప్, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.