ఫేస్బుక్లో మీ ప్రొఫైల్ను లాక్ చేసుకున్నారా..? లేకపోతే మీ ప్రొఫైల్ను సైబర్ క్రిమినల్స్ తస్కరించి.. నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టిస్తారు. మీ కాంటాక్ట్లోని స్నేహితులకు మీరు కోరుతున్నట్లు డబ్బు కోసం రిక్వెస్టులు పెడుతారు. ఫేస్బుక్ ఖాతాదారులు.. తస్మాత్ జాగ్రత్త. తాజాగా కరోనా పేరుతో దవాఖానలో ఎమర్జెన్సీ ఉందంటూ డబ్బులు లాగాలని ప్రయత్నిస్తున్నారు. ఇలా చాలా మంది ఫేస్బుక్ ఖాతాలు హ్యాక్ అవుతున్నాయి. ఇది తెలియని మీ స్నేహితులు బోల్తా పడుతున్నారు. పోలీసుల ప్రొఫైల్తో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారి ఖాతాలను సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు.
మంగళవారం సైబరాబాద్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేశారు. అతడి పేరు మీద మరో ఖాతాను తెరిచారు. ఆ తర్వాత నకిలీ ఫేస్బుక్ ఖాతా ప్రొఫైల్కు భద్రారెడ్డి ఫొటోను పెట్టారు. కాంటాక్ట్స్లో ఉన్న వారిని హాయ్.. ఎలా ఉన్నారు.. బాగున్నారా.. అంటూ పలుకరించారు. తర్వాత నాకు రూ.20 వేలు అర్జెంటుగా అవసరం ఉంది. సాయంత్రానికి ఇచ్చేస్తాను అంటూ మెసేజ్ పెట్టారు. ఇలా దాదాపు కాంటాక్ట్స్లో ఉన్న అందరికీ మెస్సేజ్ వెళ్లింది.
సైబర్ మాయగాడు భద్రారెడ్డి పేరు మీద డబ్బులను వసూలు చేసేందుకు మరో స్కెచ్ వేశాడు. ఓ నంబర్ తీసుకుని దానికి వాట్సాప్ డీపీని భద్రారెడ్డి ఫొటో పెట్టి వాట్సాప్లో కూడా అందరికీ మెస్సేజ్ పెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన భద్రారెడ్డి స్నేహితుడు వెంటనే నేరుగా భద్రారెడ్డికి ఫోన్ చేసి ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా మెస్సేజ్ ఎందుకు పంపిస్తున్నావని అడిగాడు. అనుమానం రావడంతో భద్రారెడ్డి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే తన ఫేస్బుక్ ఖాతా బ్లాక్ చేశాడు. ఆ తర్వాత తన స్నేహితులు 20మంది ద్వారా రిపోర్ట్ చేయించాడు. దీంతో కొద్ది సేపటి తర్వాత ఆ నకిలీ ఫేస్బుక్ ఖాతా డిలీట్ కావడంతో పాటు బ్లాక్ అయ్యింది.