ఖలీల్వాడి, మార్చి 11: పచ్చబంగారం రైతు ఇంట సిరులు కురిపిస్తున్నది. కొన్నేండ్లుగా నష్టాలు తెచ్చిపెట్టిన పసుపు పంట ఈ ఏడాది దండిగా లాభాలు తెచ్చిపెడుతున్నది. పంట విస్తీర్ణం తగ్గడం, మార్కెట్లో డిమాండ్ బాగా పెరగడంతో రికార్డు స్థాయి ధర పలుకుతున్నది. నిజామాబాద్ మార్కెట్లో సోమవారం అత్యధికంగా రూ.18,299 ధర పలకడం విశేషం. మార్కెట్ యార్డు చరిత్రలో ఇదే అత్యధికమని అధికారులు, రైతులు చెబుతున్నారు. అంక్సాపూర్కు చెందిన రైతు పాశపు మహేశ్ తెచ్చిన పసుపునకు ఈ రికార్డు ధర లభించింది. దాదాపు పదిహేనేండ్ల క్రితం రూ.18 వేల రేటు నమోదైంది. ఆ రికార్డును చెరిపేస్తూ సోమవారం కొత్త ధర నమోదు కావడం విశేషం.
రైతులు తల్లి పంటగా భావించే పసుపు పంట కొన్నేండ్లుగా నష్టాల్నే మిగుల్చుతున్నది. అయినప్పటికీ అన్నదాతలు పసుపును మాత్రం వదిలిపెట్టలేదు. ఒకప్పుడు బాగా డబ్బులు తెచ్చిపెట్టిన పచ్చ బంగారం.. మార్కెట్ మాయాజాలం కారణంగా ధర లేక రైతాంగం కుదేలైంది. దీంతో రైతులు సాగు విస్తీర్ణం తగ్గించారు. వాస్తవానికి తెలంగాణలో అత్యధికంగా పసుపు సాగయ్యేది నిజామాబాద్ జిల్లాలోనే. ఐదారేండ్ల క్రితం వరకు నిజామాబాద్ జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో పంట పండించే వారు. అయితే, నష్టాల కారణంగా సాగు విస్తీర్ణం తగ్గించేశారు. తొమ్మిది నెలల పంట, పెట్టుబడి అధికం కావ డం, వాతావరణం అనుకూలించక దిగుబడి పడిపోవడం, గిట్టుబాటు ధర దక్కక పోవడంతో సా గు విస్తీర్ణం క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం 19 వేల ఎకరాల్లోనే పసుపు పండించారు. జనవరి నుంచి తవ్వకాలు చేపట్టి పంటను మార్కెట్కు తీసుకొస్తున్నారు.
దశాబ్ద కాలం క్రితం మంచి రేటు పలికిన పసుపు ఆ తర్వాత నుంచి తగ్గిపోయింది. అప్పట్లో క్వింటాల్ పసుపు అమ్మి తులం బంగారం కొనే వారు. అలాంటి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. రేటు కనిష్టంగా రూ.4-6 వేలకు పడిపోయింది. ఈ స్థితిలో రైతులు పసుపు సాగు తగ్గించారు. సగానికి సగం సాగు విస్తీర్ణం తగ్గడం, అదే సమయంలో విదేశాల్లో మన పసుపునకు డిమాండ్ పెరగడంతో పంటకు ఆదరణ పెరిగింది. ఫలితంగా ఈసారి ధర పాత రికార్డులను చెరిపేస్తే కొత్త రికార్డులను నమోదు చేస్తున్నది. దశాబ్ద కాలంగా నష్టాలు చవిచూసిన రైతులకు ఈసారి ఊహించని రీతిలో లాభాలు వస్తున్నాయి.
సీజన్ ప్రారంభంలోనే చాలా మంది రైతులు తమ పంటను అమ్ముకున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే అత్యధిక రైతులు పంటను అమ్మేశారు. అప్పుడు రూ.8-10 వేల మధ్యే ధర పలికింది. మెజార్టీ రైతుల నుంచి పంట వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు ధర పెరుగుతుండడం గమనార్హం. ఈ సీజన్లో ఇప్పటివరకు 2.21 లక్షల క్వింటాళ్ల పసుపు మార్కెట్కు వచ్చింది. గత సోమవారం ఒక్కరోజే 30 వేల క్వింటాళ్లు రావడం విశేషం. ఇక నిన్న (మార్చి 11న) 10,671 క్వింటాళ్ల కొమ్ము, 5,268 క్వింటాళ్ల మండ, 1,571 క్వింటాళ్ల చూర నిజామాబాద్ మార్కెట్ యార్డుకు చేరింది. ఇందులో అంక్సాపూర్కు చెందిన పాశపు మహేశ్ తెచ్చిన కొమ్ముకు రూ.18,299 రేటు పలికింది. కనిష్టంగా రూ.8 వేలు, సగటున (మాడల్) రూ.14,250 చొప్పున ధర పలికినట్లు మార్కెటింగ్శాఖ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో పసుపు ధర రూ.20 వేలు దాటొచ్చని చెబుతున్నారు.
మార్కెట్కు పసుపు ఉత్పత్తులు తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ధర తగ్గకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. పసుపు ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండడంతో రేటు పెరుగుతున్నది. పసుపు ధర కొత్త రికార్డు నమోదు చేస్తున్నది. మొన్న రూ.15 వేలు పలికిన కొమ్ము.. ఇవాళ రూ.18 వేలకు చేరింది.