కమ్మర్పల్లి (మోర్తాడ్), డిసెంబర్ 2: పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన బాలుడు అనంత లోకాలకు చేరుకున్నారు. బర్త్డే రోజే మృత్యువాత పడ్డ ఘటన కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామస్తులను కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. చౌట్పల్లికి చెందిన మధుసూదన్(15) మోర్తాడ్లోని కృష్ణవేణి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం బషీరాబాద్ క్రాసింగ్ నుంచి యాక్టివాపై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ నెల 2వ తేదీనే బాలుడి పుట్టిరోజు కావడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. మధుసూదన్ మృతిచెందిన విషయం తెలుసుకున్న కృష్ణవేణి పాఠశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది. బాలుడి అంత్యక్రియలకు ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజశేఖర్ తెలిపారు.