కామారెడ్డి/ ఖలీల్వాడి, మార్చి 17: పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించేం దుకు పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగనుండగా ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 11,962 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 5,834 మంది బాలురు, 6128 మంది బాలికలు ఉన్నారు. 62 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 3 ఫ్లయింగ్ స్కాడ్స్, ఆరుగురు రూట్ ఆఫీసర్లు, 16 మంది సిట్టింగ్ స్కాడ్స్, 662 మంది ఇన్విజిలేటర్లతోపాటు 62 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ తదితరులు పర్యవేక్షిస్తారు.
కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 22,281 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, 141 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు 141 మంది సిట్టింగ్ స్కాడ్స్, 7 ఫ్లయింగ్ స్కాడ్స్ను నియమించామన్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9.35 గంటల వరకు అనుమతిస్తామన్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చినట్లు వెల్లడించారు.