మెండోరా/ ఏర్గట్ల, జూలై 23: నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ దిగువన గోదావరి నది వరదలో చిక్కుకుపోయిన ఏడుగురు స్వామీజీలను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. ఎస్సారెస్పీ దిగువన మెండోరా మండలం సావెల్, ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామాల మధ్యన గోదావరి తీరాన ఉన్న సాంబయ్య ఆశ్రమానికి బుధవారం మధ్యాహ్నం ముగ్గురు స్వాములు వేర్వేరు ప్రాంతాల నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం వచ్చారు. అప్పటికే ఆశ్రమంలో నలుగురు స్వాములు ఉన్నారు. బుధ, గురువారాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది నిండుగా మారిపోయింది. మరోవైపు గురువారం ఉదయమే భారీ ఇన్ఫ్లో రాకతో ఎస్సారెస్పీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు భారీగా వరద నీటిని వదిలారు. దీంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.
దీంతో ఆశ్రమంలో ఉన్న స్వామీజీలు మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన కృష్ణ, నిర్మల్ జిల్లా గొల్లమడుగుకు చెందిన సకిండ్ల గంగారాం, సారంగపూర్ మండలం కౌట్ల(బీ)కి చెందిన నారాయణ, సోన్కు చెందిన వెంకట్ రావ్, పీసర ధర్మోరాకు చెందిన ముత్తెన్న, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్కు చెందిన బోగ హన్మాండ్లు, బాల్కొండకు చెందిన సుదర్శన్ వరదలో చిక్కుకుపోయారు. గురువారం సాయంత్రం ఎస్సారెస్పీకి చేరుకొని వరదపై సమీక్షించిన మంత్రి వెంటనే ఫోన్ ద్వారా స్వామీజీలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారిని కాపాడాలని ఎన్డీఆర్ఎఫ్ అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం వేకువజామున ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు రంగంలోకి దిగారు. రెండున్నర గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బోటు ద్వారా ఆశ్రమంలో ఉన్న ఏడుగురు స్వాములను రక్షించి సావెల్ గ్రామానికి చేర్చారు. ఆపరేషన్ జరుగుతున్నంత సేపు మంత్రి వేముల అధికారులతో మాట్లాడుతూ సమన్వయం చేశారు. మంత్రి ఆదేశాలతో ఆర్డీవో శ్రీనివాసులు పరిస్థితిని పర్యవేక్షించారు. తమను క్షేమంగా బయటికి తీసుకువచ్చినందుకు సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ యంత్రాంగానికి స్వాములు ధన్యవాదాలు తెలిపారు.