నవీపేట, అక్టోబర్ 12: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అర్ధాంతరంగా నిలిచిన సెంట్రల్ లైటింగ్ పనులు మొదలయ్యాయి. ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ జిల్లా టాబ్లాయిడ్లో “మధ్యలోనే వదిలేశారు..” అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి రోడ్లు, భవనాల శాఖ ఎస్ఈ(ఎలక్ట్రికల్) లింగారెడ్డి స్పందించారు. డిప్యూటీ ఈఈ కృష్ణమూర్తి పర్యవేక్షణలో సంబంధిత కాంట్రాక్టర్ శ్రీనివాస్ గౌడ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఈఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ అనివార్య కారణాలతో నవీపేట మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనుల్లో ఆలస్యం జరిగిందన్నారు.
రూ.1.50 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులను నాలుగు రోజుల్లో పూర్తి చేసి విద్యుత్ కనెక్షన్ ఇస్తామన్నారు. నూతనంగా మంజూరు లభించిన జగ్గారావు ఫారం వద్ద ఆరు స్తంభాలను మరో వారం రోజుల్లో బిగిస్తామని, లైట్లు వెలిగేందుకు గాను విద్యుత్ శాఖకు డీడీ కట్టాల్సి ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాగానే లైట్లు వెలుగుతాయని పేర్కొన్నారు. సెంట్రల్ లైటింగ్ పనులు పునఃప్రారంభం కావడంపై వివిధ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తంచేశారు