ఖలీల్వాడి, మే 31: నిజామాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు చార్జీల భారం తప్పింది. నగరంలోని ఒక కాలనీ నుంచి మరోకాలనీకి ఆటో, ట్యాక్సీల్లో ప్రయాణించాలంటే అధిక చార్జీలు చెల్లించాల్సిందే. పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో ఏ ప్రాంతానికి ప్రయాణించాలన్నా రూ.20కి పైగానే చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ నగరంలో సిటీ బస్సులను ప్రవేశపెట్టింది. 30 ఏండ్ల తర్వాత టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చొరవతో నగరంలో సిటీ బస్సులు రోడ్డెక్కడంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మేయర్ దండు నీతూకిరణ్తో కలిసి బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవల సిటీ బస్సు సేవలను ప్రారంభించిన విషయం విదితమే.
అతి తక్కువ చార్జీలు..
నగరంలో ప్రారంభించిన సిటీ బస్సుల్లో అతి తక్కువ చార్జీలకే ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. ప్రస్తుతం నాగారంలోని 300క్వార్టర్స్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా న్యూ కలెక్టరేట్ వరకు సిటీ బస్సులను నడుపుతున్నారు. సాధారణ చార్జీ రూ.10 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి 15 నిమిషాలకో బస్సు తిరుగుతున్నది.
అవగాహన కల్పిస్తున్న అధికారులు..
సిటీ బస్సు సేవలను ప్రయాణికులు వినియోగించుకునేలా ఆర్టీసీ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పనిచేసే ప్రాంతాల గుండా సేవలందిస్తుండడంతో సిటీ బస్సులోని సీట్లని నిండిపోతున్నాయి. తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుస్తుండడంతో ప్రజలు సైతం ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
300 క్వాటర్స్ నుంచి న్యూ కలెక్టరేట్ వరకు చార్జీలు..
నాగారం రూ. 10, ఇంద్రాపూర్ రూ. 10, వర్ని రోడ్ రూ. 10, ఆర్ఆర్ చౌరస్తా 10, నెహ్రూ పార్కు రూ. 10, గాంధీచౌక్ రూ. 10, దేవీ రోడ్ రూ. 10, బస్ స్టేషన్ రూ. 10, రైల్వే బిడ్జి రూ. 20, దుబ్బ రోడ్ రూ. 20, నిర్మల హృదయ్ రూ. 20, ఎస్ఎఫ్ఎస్ రూ. 20, రైతు బజార్ రూ. 20, ఆదర్శనగర్ రూ. 20, కాలూర్ రోడ్ రూ. 20, జీజీ కాలేజ్ రూ. 20, న్యూ కలెక్టరేట్ రూ. 20.
సద్వినియోగం చేసుకోవాలి..
నగరంలోని ప్రజలు సిటీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి. అతి తక్కు వ ధరకే ప్రజలకు అందుబాటులో బస్సు సౌకర్యం కల్పించాం. 30ఏండ్ల తర్వాత నగర ప్రజలకు సిటీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
– ఉషాదేవి,ఆర్టీసీ రీజినల్ మేనేజర్