డిచ్పల్లి, ఆగస్టు 10: ఒక హత్య కేసులో నిందితుడిని విచారించగా.. మరో రెండు హత్యలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ముగ్గురిని హత్య చేసిన కేసులో నిందితుడు మహ్మద్ షారూఖ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. మంగళవారం డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన తెలిపిన ప్రకారం.. డిచ్పల్లి మండలంలోని ఘన్పూర్ గ్రామ శివారులోని శ్మశానవాటిక ప్రహరీ వద్ద ఈ నెల 5న మిట్టాపల్లి గ్రామానికి చెందిన సుంకెట నర్సవ్వ మృతదేహం లభించింది. నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో డిచ్పల్లి సీఐ రఘునాథ్ ఆధ్వర్యంలో ఎస్సై ఆంజనేయులు, ఇందల్వాయి ఎస్సై గౌరేందర్గౌడ్, శిక్షణ ఎస్సైలు తిరుపతి, రమాదేవి, శివకుమారి సిబ్బందితో కలిసి కేసు దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడిగా గుర్తించిన షారూఖ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నర్సవ్వను తానే హత్య చేసి ఆమె వద్ద ఉన్న డబ్బులను ఎత్తుకెళ్లిపోయినట్లు అంగీకరించాడు.
ఏడాదిన్నర క్రితం మిట్టపల్లికి చెందిన మహ్మద్ సల్మాన్ఖాన్ను బండరాయితో తల పగులగొట్టి, అతడి జేబులో ఉన్న రూ.500, చేతికి ఉన్నవాచీని దొంగిలించాడని సీపీ తెలిపారు. ఆరు నెలల క్రితం ఘన్పూర్ గ్రామానికి చెందిన షేక్ మోసిన్తో కలిసి కల్లు తాగుతుండగా.. తనను బూతులు తిట్టాడన్న కోపంతో రాయితో తలపై కొట్టి చంపినట్లు షారూఖ్ అంగీకరించాడని చెప్పారు. మోసిన్ పర్సులో ఉన్న రూ.750 దొంగిలించాడన్నారు. ఈ మూడు హత్యలు చేసిన నిందితుడు షారూఖ్ పై సెక్షన్ 302, 379, 43తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి కృషి చేసిన ఏసీపీ, సీఐ, ఎస్సై లతో పాటు కానిస్టేబుళ్లు తిరుపతి, సయ్యద్ జావేద్, ఎం.రాజేశ్వర్, కేర్బాజీ, లింగం, శ్రీను, శ్రావణ్, గబ్బర్సింగ్, రాఘవేంద్రను కమిషనర్ అభినందించారు.