నిజామాబాద్, జూలై 23, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం స్ఫూర్తితో చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చిన్న పాయలా మొదలై నేడు నదీ ప్రవాహంలా విస్తరించింది. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన వృక్షార్చన విజయవంతమైంది. తమ నాయకుడికి తెలంగాణ ప్రజలంతా మొక్కలను కానుకగా అందించి అభిమానాన్ని చాటుకున్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చనకు ఎంపీ సంతోష్ కుమార్ నడుం బిగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల పండుగ శనివారం అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ లక్షలాది మొక్కలు నాటి కేటీఆర్కు హరిత కానుకను అందించేందుకు ఆయన అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సైతం తమ నియోజకవర్గాల్లో భారీగా ఎత్తున ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
వేగంగా విస్తరించిన హరిత సవాల్
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇటీవలే దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎంపీ సంతోష్ కుమార్ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ర్టానికి దేశ వ్యాప్త కీర్తి సంపాదించడంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉపయుక్తమైంది. ఒకరు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి హరిత సవాల్ విసరడం, ఆ ముగ్గురు మూడేసి మొక్కలు నాటి… మరింత మందికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసరడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. ఒకరితో మొదలైన హరిత సవాల్ నేడు వేల నుంచి లక్షలాది మందికి పాకింది. పుట్టిన రోజు, పెండ్లి రోజు ఇలా ఏ శుభకార్యమైనా రాష్ట్రంలోని హరిత ప్రేమికులు ఎంతో మంది గ్రీన్ ఇండియా చాలెంజ్కు సిద్ధమవుతుండడం మనలో వచ్చిన హరిత మార్పుకు చిహ్నంగా నిలుస్తోంది. ‘వానలు వాపస్ రావాలి… వానరాలు వాపస్ పోవాలి…’ అనే నినాదంతో సీఎం కేసీఆర్ అటవీ సంపదను పెంచడానికి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరిత స్ఫూర్తితోనే ఎంపీ సంతోష్ తనదైన ఆలోచనతో దేశ వ్యాప్తం చేయడం విశేషం.
పచ్చందాలకు ప్రాణం..
పచ్చదనం లేకపోతే జీవం లేదు. మొక్కల సంరక్షణ లేకపోతే మనిషి మనుగడ కష్టం. మొక్కలే శ్వాస. వృక్షాలే ఊపిరిగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. 33 శాతం అటవీ విస్తీర్ణమే ధ్యేయంగా మొక్కలను నాటేందుకు ఉద్యమంలా పని చేస్తున్నారు. పచ్చదనమే కరువైన పరిస్థితి నుంచి ఇప్పుడు ఎటు చూసినా మొక్కల సంరక్షణతో తెలంగాణ పల్లెలు వికసిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మునుపు వరకు విచక్షణా రహితంగా అడవుల విధ్వంసం ఉండగా ఇప్పుడు సంరక్షణ చర్యలతో అటవీ సంపద సురక్షితమైంది. జంతుజాలానికి ఢోకా లేకుండా పోయింది. ఏడో విడుత హరితహారంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లక్షలాది మొక్కలను నాటారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున అందించి ప్రజలను హరితహారంలో భాగస్వామ్యం చేశారు. పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడానికి, వానలు సమృద్ధిగా కురవడానికి, మానవ మనుగడ సాఫీగా సాగేందుకు మొక్కల సంరక్షణ ఎంతగా ఉపయోగపడుతుందో తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్ఫూర్తివంతంగా పని చేస్తోంది. దేశ వ్యాప్తంగా మొక్కల సంరక్షణ చర్యల్లో టాప్ వన్లో నిలిచి మరెంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా కేసీఆర్ నిలిచారు.
ఉదయం పది గంటలకు వృక్షార్చన
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.జూలై 24 కేటీఆర్ జన్మదినం సందర్భంగా తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు మొక్కలు నాటనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే వృక్షార్చనలో పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి పాల్గొనేందుకు ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. బాన్సువాడలో 3లక్షల మొక్కలు నాటేందుకు స్పీకర్ పోచారం ప్రణాళికలు సిద్ధం చేశారు. బాన్సువాడ మున్సిపాలిటీలో లక్ష మొక్కలు, 120 జీపీల్లో 2500 మొక్కలు నాటనున్నారు.
బాల్కొండ నియోజకవర్గంలోనూ 3లక్షల 40వేల మొక్కలు నాటాలని మంత్రి వే ముల నిర్ణయించారు. 8 మండలాల్లోని బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో 30వేల చొప్పున 2.40 లక్షల మొక్కలు నాటనున్నారు. 100 జీపీల్లో వెయ్యి మొక్కలు చొప్పున మరో లక్ష మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటిచెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇదే రీతిలో నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బిగాల గణేశ్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, షకీల్ భారీ స్థాయిలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే నేతృత్వంలో ‘వృక్షార్చన’ జరుగనుంది.