నిజామాబాద్, జులై 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వారం రోజులుగా జోరు వానలు కురుస్తున్నాయి. బుధ, గురు వారాల్లో కుండపోత వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. తెరిపినివ్వకుండా దంచి కొట్టిన వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రధాన జలాశయాలు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఉభయ జిల్లాల్లో సీజన్ ఆరంభంలో కురిసిన వర్షాలతో సాగు పరిస్థితి ఆశాజనకంగా మొదలైంది. మధ్యలో కొన్ని రోజుల పాటు వరుణుడు ముఖం చాటేయడంతో పంటల సాగు నెమ్మదించింది. ప్రస్తుతం వరుణుడి జోరు కొనసాగుతుండడంతో అన్నదాతలు సంతోషపడుతున్నారు. ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో సగం శాతమే పంట సాగు కాగా ఇక పనులు ఊపందుకోనున్నాయి.
జనజీవనం ఆగమాగం..
ఉమ్మడి జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించింది. సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి దాకా అన్ని మండలాల్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సరిహద్దున ఉన్న ప్రాజెక్టులు సైతం నిండాయి. మహారాష్ట్రలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద గోదావరిలో చేరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. గురువారం ఒక్కరోజులోనే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సగం మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పలు చోట్ల వరద ప్రవాహంతో గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. పలు చోట్ల బీటీ రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
బాల్కొండలో భారీ వాన…
నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో భారీ వర్షపాతం నమోదైంది. గురువారం ఒక్క రోజే మెండోరాలో అత్యధికంగా 19.2 సెం.మీ. వర్షం కురిసింది. కమ్మర్పల్లిలో 17.4, ఏర్గట్లలో 16.4, బాల్కొండలో 16.2, భీంగల్, మోర్తాడ్, వేల్పూర్, ముప్కాల్లో 14.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆర్మూర్ నియోజకర్గంలోనూ దంచి కొట్టిన వానతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. నందిపేటలో 15.8 సెం.మీ, ఆర్మూర్లో 14.5, మాక్లూర్లో 10సెంటీ మీటర్ల వాన కురిసింది. నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా ఇందల్వాయిలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సీజన్లో నేటి వరకు నిజామాబాద్ జిల్లా సగటు వర్షపాతం కన్నా 82శాతం అధికంగా వర్షాలు పడినట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 29 మండలాలకు ధర్పల్లి మినహా 28 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. కామారెడ్డి జిల్లాలో 22 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా మూడు రోజులుగా కురుస్తున్న వానలతో సాధారణ వర్షపాతం కన్నా 96శాతం మేర అధికంగా వానలు కురిశాయి. గాంధారిలో అత్యధికంగా 8.5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా పిట్లంలో 2.9 సెంటీ మీటర్ల మేర వర్షం కురిసింది.
ఆరెంజ్ జోన్లో నిజామాబాద్ జిల్లా!
రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో నమోదైన వర్షపాతం ఆందోళనకరంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్గా, నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ఆరెంజ్ జోన్గా వాతావరణ శాఖ నిర్ధారించింది. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలు ఆరెంజ్ జోన్ పరిధిలోకి రాగా మిగిలినవి సాధారణ వర్షపాతం పరిధిలోకి వచ్చాయి. బాల్కొండ, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18 ప్రాంతాల్లో 15నుంచి 20 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆరెంజ్ జోన్ ప్రాంతాల్లో నందిపేట మండలంలోని సీహెచ్ కొండూర్, తొండాకూర్, ఆర్మూర్ మండలంలోని ఆలూర్, మచ్చర్ల, మగ్గిడి, మాక్లూర్ ఉన్నాయి. బాల్కొండ, వేల్పూర్, భీమ్గల్, కమ్మర్పల్లి మండలకేంద్రంతోపాటు కోనాసముందర్, మోర్తాడ్, ఏర్గట్ల, మెండోరా, సిరికొండ, చీమన్పల్లి ప్రాంతాలు ఆరెంజ్ జోన్లో ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.