భిక్కనూరు, మే 3: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. భిక్కనూరు మండలం జంగంపల్లి, దోమకొండతోపాటు మండలంలోని ముత్యంపేట్ గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు దారి సక్రమంగా లేక పోవడంతో ద్విచక్రవాహనంపై పర్యటించారు. రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. జంగంపల్లిలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ..అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జంగంపల్లిలో వడగండ్లతో 1200 ఎకరాల్లో వరి పంట పూర్తిగా ధ్వంసమైందని, ఇది చాలా బాధాకరమన్నారు.
ఇన్నేండ్లలో ఇంతపెద్ద మొత్తంలో వడగండ్ల వాన కురవడం చూడలేదన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోనే 85,308 ఎకరాల్లో వరినాట్లు వేయగా.. గతనెల 25 వరకు అందిన సమాచారం మేరకు ఒకేరోజు 15, 550 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు తెలిపారు. ఇంకా నివేదికలు వస్తున్నాయని చెప్పారు. జరిగిన పంట నష్టం వివరాలను సేకరించి ప్రతిరైతుకూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అన్నదాతలను ఆదుకుంటానని సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ఒక్క గుంట కూడా నష్టపోకుండా జిల్లా యంత్రాంగం, వ్యవసాయాధికారులు వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. రైతులెవరూ అధైర్యపడవద్దని సూచించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత రైతుకు రూ. 25 వేల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వ విప్ వెంట అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఎంపీపీ గాల్రెడ్డి, సర్పంచ్ నర్సింహులు యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ సిద్ధరాములు, ఉప సర్పంచ్ భాస్కర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, భిక్కనూరు మాజీ సర్పంచ్ నాగభూషణం గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శివలింగం, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాల్ చంద్రం, వ్యవసాయ అధికారులు అపర్ణ, రాధారెడ్డి, దోమకొండ జడ్పీటీసీ తిర్మల్గౌడ్, ఎంపీపీ శారద, సర్పంచులు సూర్యప్రకాశ్రెడ్డి, నల్లపు అంజలీ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ నాగరాజ్రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ నర్సారెడ్డి,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్రావు, ఎంపీటీసీ శంకర్, నాయకులు ఐరేని నర్సయ్య, షమీ, బుర్రి రవి, నాగరాజు, సుధాకర్ యాదవ్, ఏవో పవన్ కుమార్, నాయకులు తదితరులు ఉన్నారు.