నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణంలోని గండిరామన్న దత్త సాయి ఆలయాన్ని రూ.కోటీతో అభివృద్ధి చేశామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని దేవరకోట వేంకటేశ్వర స్వామి ఆలయం, గండిరామన్న దత్తసాయి ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జమ్మి చెట్టు పవిత్రమైనదని, పాండవులు అరణ్యవాసం వెళ్లిన సమయంలో తమ ఆయుధాలను చెట్టుపై ఉంచి భద్రపరిచారని పేర్కొన్నారు. ఈ ఆయుధాలతోనే యుద్ధంలో గెలిచి విజయం సాధించారని తెలిపారు. ప్రతీ ఊరిలో, గుడిలో జమ్మి చెట్టు ఉంచి రోజు పూజ చేయడం వల్ల శుభం కలుగుతుందని అన్నారు.
జమ్మి మొక్కలను నర్సరీలలో మొక్కలు పెంచడానికి ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. ఆలయంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని పార్కులను సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న చావడి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఆలయంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షులు, ఆలయ కమిటీ చైర్మన్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్, దేవరకోట ఆలయ చైర్మన్ లక్ష్మీనారాయణ, ప్రముఖ వ్యాపార వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు పాల్గొన్నారు.