చెన్నై : కరోనా బారినపడి మరణించిన వారి అంత్యక్రియలకు సొంత మనుషులే దూరమవుతున్న రోజుల్లో కొవిడ్-19 రోగుల మృతదేహాలకు అంత్యక్రియలు జరపడంలో డీఎంకే కార్యకర్త ఆయూబ్ ఖాన్ ముందుకొచ్చారు. సెకండ్ వేవ్ లో తమిళనాడులోని శివగంగలో 64 మృతదేహాలకు ఆయూబ్ దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. ఈ క్రతువులో ఆయూబ్ కు ఆయన కుమారుడు రజ్జా చేదోడువాదోడుగా నిలిచారు.
కొవిడ్-19తో మరణించిన వారి అంత్యక్రియలు చేపట్టడం కుటుంబ సభ్యులకు క్లిష్టంగా మారడంతో అలాంటి వారికి తాను అంత్యక్రియలు జరిపించానని శివగంగ డీఎంకే యూత్ వింగ్ కార్యదర్శి ఆయూబ్ పేర్కొన్నారు. ఫస్ట్ వేవ్ లో 16 మృతదేహాలకు, సెకండ్ వేవ్ లో 64 మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించానని ఆయన వెల్లడించారు. అంత్యక్రియల తంతు నిర్వహించేందుకు స్మశాన వాటికల్లో తన కుమారుడు రజ్జా (/19) సహకరించేవాడని చెప్పారు.
కరోనా మృతుల కుటుంబ సభ్యులు చాలా మంది తాము గర్భిణులమనో, ఇంటి వద్ద పిల్లలు, పెద్ద వారు ఉన్నారనో చెబుతూ తమచేతే అంత్యక్రియలు జరిపించే వారని ఆయూబ్ తెలిపారు. మరికొందరు కరోనా వైరస్ సోకుతుందనే భయంతో స్మశానం వద్దకు కూడా వచ్చే వారు కాదని అన్నారు. రూ 2500 వరకూ అంత్యక్రియల కోసం రుసుము చెల్లించి తమతోనే జరిపించేవారని చెప్పారు. తనకు, తన కుమారుడు, మరో ఇద్దరు అసిస్టెంట్లకు అవసరమైన పీపీఈ కిట్లు, ఇతర రక్షణ పరికరాలను తన సొంత ఖర్చుతో సమకూర్చుకున్నానని తెలిపారు.