పండుటాకులు, అభాగ్యులకు సర్కారు అండగా
వృద్ధులు, దివ్యాంగులు పింఛన్తో ఆసరా
ఖమ్మం కార్పొరేషన్లో 21,874 మందికి లబ్ధి..
నెలకు రూ. 4.78 కోట్లు పంపిణీ
సీఎం కేసీఆర్కు పింఛన్ దారుల దీవెనలు
ఖమ్మం ఏప్రిల్ 20 : పండుటాకులు, అభాగ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరాగా నిలుస్తున్నది. నిరుపేదల సంక్షేమం, సాంఘిక భద్రత కల్పించేందుకు పింఛన్లతో భరోసా కల్పిస్తున్నది. 2014 అక్టోబరులో ప్రవేశపెట్టిన ఆసరా పథకంతో జిల్లాలో లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. సమాజంలో నిస్సాహాయ స్థితిలో ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు గౌరవంగా బతికేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూతనందిస్తున్నారు. గత ప్రభుత్వాలు అందించిన సామాజిక పింఛన్లు, కనీస అవసరాలు తీర్చుకోవడానికి సరిపోలేదు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులు ప్రతి నెల రూ.3016, ఇతర వర్గాలకు రూ.2,016 చొప్పున పంపిణీ చేస్తున్నది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో 21,874 మందికి ప్రతినెల రూ.47,76,0,984 అందజేస్తున్నారు.
ఆసరాగా నిలిచి..
తల్లిదండ్రులను పట్టించుకోని వృద్ధులకు, భర్త కోల్పోయి ఎలాంటి ఆధారణ లేకుండా బతుకుతున్న వితంతువులకు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వ పింఛన్తో భరోసా లభిస్తున్నది. కేసీఆర్ పెంచిన పింఛన్ వృద్ధులకు బతుకుపై భరోసా కల్పిస్తున్నది. రూ.2వేల పింఛన్ తీసుకుని నెలకు సరిపడా సరుకులు తెచ్చుకొని ఆనందంగా జీవిస్తున్నారు. ఎవరిమీద ఆధారపడకుండా బతుకీడుస్తున్నారు. రూ.2 వేల పింఛన్ కోసమైనా వారి బాగోగులను చూసేందుకు కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు ముందుకొస్తున్నారు. గత ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు ఒక్కొక్కరికీ నెలకు రూ.200 పింఛన్ ఇచ్చేది. దివ్యాంగులకు రూ.500లు పింఛన్ ఇచ్చింది. ఇది ఎటూ సరిపోకపోయేది. ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
కేసీఆర్ సల్లంగుండాలే..
ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2వేల పింఛన్ ఇస్తూ మాకు ఆసరాగా నిలుస్తున్నారు. మాలాంటి వారెందరికో మేలు జరుగుతున్నది. కేసీఆర్ సార్ సల్లంగుండాలే. పింఛన్ డబ్బులతో నెలకు సరిపడే బియ్యం, సరుకులు తెచ్చుకుంటున్నా. గతంలో ఏ నాయకుడు ఇవ్వని విధంగా పింఛన్ ఇస్తున్నారు. తెలంగాణ వస్తే ఏదో పోతుందన్నారు. తెలంగాణ రావడం వల్లనే పింఛన్ పెరిగింది. నా ఓటు కారు గుర్తుకే వేసి ముఖ్యమంత్రికి మద్దతు పలుకుతాను.
సీహెచ్.శారద, నిజాంపేట