సంగారెడ్డి, నమస్తే తెలంగాణ/మెదక్, మార్చి 30 : ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేశారు. ధాన్యాన్ని తామే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోళ్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఆయా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వానకాలం సీజన్తో పోల్చితే యాసంగిలో వరి సాగు పెరుగడంతో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంట దిగుబడి, కొనుగోళ్ల లక్ష్యం, ఏర్పాటు చేయాల్సిన కొనుగోలు కేంద్రాలు, అవసరమైన గన్నీ బస్తాలు ఎన్నో అంచనా వేసి ప్రణాళికలను జిల్లా పౌర సరఫరాల సంస్థ రూపొందించింది.
మెదక్ జిల్లాలో లక్ష్యానికి మించి సాగు..
మెదక్ జిల్లాలో యాసంగిలో వరి సాగు లక్ష్యానికి మించి సాగైంది. సింగూరు ప్రాజెక్టు నిండడంతో ఘణపూర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి విడుదల చేయడంతో ఆయకట్టు పరిధిలోని రైతులు ఈ యాసంగిలో వరిని సాగు చేశారు. ఈ యాసంగిలో జిల్లాలో 2,12,529 ఎకరాల్లో వరి సాగైనట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా పచ్చని పంటలు కళకళలాడుతున్నాయి. ఈ యాసంగిలో అంచనాలకు మించి వరి సాగు కావడంతో పంట ఎంత దిగుబడి వస్తుందో జిల్లా పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. దీని ప్రకారమే కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకుంది. 2019-20 యాసంగిలో 79,305 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, 1. 77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుత యాసంగి సీజన్లో 2,12,529 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. దీని ద్వారా 4,92,247 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి ధాన్యం వస్తుందని అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 322 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 1,368 టార్ఫలిన్లు, 9 ప్యాడీ క్లీనర్ యంత్రాలు, 89 తేమను కొలిచే యంత్రాలు, 4 తూకం మిషన్లు, 47 లక్షల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని అధికారులు భావిస్తున్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు జిల్లాలో 94 రైస్మిల్లులు, 34 బాయిల్డ్ రైస్ మిల్లులను గుర్తించారు.
సంగారెడ్డి జిల్లాలో 1.60 లక్షల ధాన్యం సేకరణ లక్ష్యం
సంగారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్లో 30,118 హెక్టార్లలో రైతులు వరి పంటను సాగు చేశారు. వ్యవసాయశాఖ అధికారుల అంచనా మేరకు హెక్టారుకు రూ.59.28 టన్నుల వరి ధాన్యం దిగుబడి రానుంది. దీంతో రైతులు సాగు చసిన 30,118 హెక్టార్లలో 1,78,536 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుంది. ఇందులో రైతులు స్థానికంగా 17,853 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్ముకుంటారని అంచనా. మిగితా 1,60,682 మెట్రిక్ టన్నుల వరి ధాన్యంను రైతుల నుంచి సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 40,17,058 గన్నీ బ్యాగులు అవసరం కానున్నాయి. సంగారెడ్డి జిల్లా యంత్రాంగం గత యాసం గి సీజన్లో 54945 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. గత యాసంగి సీజన్ 2019-20లో 93 కొనుగోలు కేంద్రాల ద్వారా 43,304 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారులు లక్ష్యానికి మించి 54945 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుతం జిల్లాలో ధాన్యం సేకరణకు 40,17,058 గన్నీ బ్యాగులు, 3810 టార్పాలిన్లు, 127 ప్యాడీ క్లీనర్లు, 127 తూనిక యంత్రాలు, 37 రా రైస్మిల్లులు, 15 బాయిల్డ్ రైస్ మిల్లులను గుర్తించారు.
మెదక్ జిల్లాలో 322, సంగారెడ్డి జిల్లాలో 127 కేంద్రాలు
వరి ధాన్యం కొనుగోళ్ల కోసం మెదక్ జిల్లాలో 322, సంగారెడ్డి జిల్లాలో 127 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో డీఆర్డీఏ పర్యవేక్షణలో ఐకేపీ ద్వారా 70 కొనుగోలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 50, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 4, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో 3 కొనుగోలు కేంద్రాలు, మెదక్ జిల్లాలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 210 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 108 కేంద్రాలు, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 4 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఈ యాసంగిలో కూడా ప్రభుత్వం వరికి మద్దతు ధరను ఏ గ్రేడు రకానికి రూ.1888, బీ గ్రేడ్ రకానికి రూ.1868 నిర్ణయించారు. ఈ యాసంగిలో చాలా మంది రైతులు సాధారణ రకాన్ని మాత్రమే సాగు చేశారు. రైతులు మార్కెట్కు ధాన్యం తీసుకువచ్చేటప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా, వీఆర్వో, ఏఈవోతో ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం..
యాసంగిలో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేస్తాం. జిల్లాలో ఘణపూర్ ప్రాజెక్టు కింద వరి సాగు పెరిగింది. జిల్లాలో 4. 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. జిల్లాలో వానకాలంలో 322 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ సారి కూడా 322 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. కొనుగోళ్లకు సంబంధించి బుధవారం మిల్లర్లు, పౌర సరఫరాల సంస్థతో జిల్లా అదనపు కలెక్టర్ సమీక్షిస్తారు.
-ఎస్.హరీశ్, జిల్లా కలెక్టర్ మెదక్.
ఇవీ కూడా చదవండి..