చొప్పదండి నియోజకవర్గంలో మూడోరోజూ లాక్డౌన్ విజయవంతం
వెలవెలబోయిన రోడ్లు..
కళ తప్పిన మార్కెట్లు
చొప్పదండి,మే14: మూడోరోజైన శుక్రవారం లాక్డౌన్ విజయంతమైంది. నియోజకవర్గవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు. ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనుల కో సం తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలే దు. పాలు, కూరగాయలు, కిరాణ షాపులు, ఇతర దుకాణాలను ఉ.6 గంటల నుంచి 10 వరకు తెరిచి ఉంచడంతో సామగ్రి, కూరగాయల కొనుగోలుకు బయటకు వచ్చారు. రంజాన్ పండుగ నేపథ్యంలో పలుచోట్ల ముస్లింలు రోడ్లపై కనిపించారు. 10 గంటల తర్వాత ఇండ్లలోకి వెళ్లి ప్రార్థనలు చేసుకున్నారు. చొప్పదండి పట్టణంలో తెలంగాణ, అంబేద్కరః చౌరస్తాలవద్ద ఎస్ఐ వంశీక్రిష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘంచిన వారికి జరిమానాలు విధించారు. కౌన్సెలింగ్ ఇస్తూ వెనక్కి పంపించారు. పెండింగ్ చలాన్స్ ఉన్న 34 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బోసిపోయిన పల్లెలు..
గంగాధర, మే 14 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్డౌన్ విధించడంతో మండలంలోని గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య నిత్యావసర సరుకులు, వ్యక్తిగత పనుల కోసం బయటికి వచ్చిన జనం 10 గంటల తర్వాత ఇండ్లకే పరిమితమయ్యారు. నిత్యం జనంతో రద్దీగా ఉండే మధురానగర్, గంగాధర, బూరుగుపల్లి, గర్శకుర్తి గ్రామాలు లాక్డౌన్తో జనం కనపించలేదు. మండలంలో లాక్డౌన్ అమలును అ ధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బయటికి రావద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర సమయంలో బయటికి వచ్చిన వారి నుంచి వివరాలు సేకరించి అనుమతినిస్తున్నారు. ఓ వైపు ఎండాకాలం, మరో వైపు లాక్డౌన్ అమల్లో ఉన్నందున ప్రజలు సైతం బయటికి రాకుండా ఇండ్లలోనే ఉంటున్నారు. రంజాన్ పండుగ ఉండడంతో పలువురు ముస్లింలు రోడ్లపై కనిపించారు.