హైదరాబాద్, మే5 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ మార్గదర్శకాలు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో-7పై సర్కార్ తర్జనభర్జన పడుతున్నది. ఫీ జు రీయింబర్స్మెంట్ నిధులను డీబీటీ విధానంలో నేరుగా విద్యార్థుల ఖాతాల్లో నే జమ చేయాలని నిర్ణయించింది. విద్యార్థులకు నిధులు చెల్లించాక కాలేజీలు ఫీ జు వసూలు చేసుకోవాలనే షరతులు విధించిన విషయం తెలిసిందే. అయితే డీబీ టీ విధానాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పథకాన్ని నిర్వీర్యం చేసేందుకేనని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు సర్కార్పై మండిపడుతున్నాయి. మరోవైపు విద్యార్థులకు చెల్లించిన తరువాతే వసూలు చేసుకోవాలనే షరతుపై కాలేజీ యాజమాన్యాలు ఆగ్రహించి కోర్టును ఆశ్రయించడంతో జీవో అమలుపై హైకోర్టు స్టే విధించింది. నిధులు ఎప్పుడు చెల్లిస్తారనేదానిపై సమగ్రమైన కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్ను ఆదేశించింది.
దీంతో న్యాయనిపుణులు, అధికారులతో మంగళవారం సచివాలయంలో సమీక్షించింది. జీవో-7లోని పేరా-12పై కోర్టుకు ఏం చెప్పాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. కొత్త వారికి రీయింబర్స్మెంట్ ఎలా ఇవ్వాలి?, సెకండ్, థర్డ్ ఇయర్ విద్యార్థులకు ఎలా ఇవ్వాలనే దానిపై చర్చించినట్టు సమాచారం. సంవత్సరంలో రెండు విడుతల్లో ఇవ్వాలనే అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. ఈ ఏడాది నుంచి ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) హాజరును పక్కాగా అమలు చేయాలని, 75 శాతం హాజరుంటేనే ఫీజులు చెల్లించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అడ్మిషన్ పొందిన మూడు నెలల్లో కొంత మొత్తం జమచేయాలని భావిస్తున్నట్టు సమాచారం. పాతబకాయిల చెల్లింపుపై సమావేశంలో చర్చ జరుగనట్టు తెలిసింది.