హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్ఎట్ పరీక్షలు సోమవారం ముగిశాయి. ఫలితాలను పది రోజుల్లో విడుదల చేయాలని జేఎన్టీయూ అధికారులు భావిస్తున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి 93. 38శాతం, ఇంజినీరింగ్ విభాగానికి 93. 58శాతం విద్యార్థులు హాజరయ్యారు. రెండింటికి కలిపి దాదాపు 20వేల మంది విద్యార్థులు డుమ్మా కొట్టడం గమనార్హం. ఎప్సెట్ పరీక్షలు ఈ నెల 4న ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఎప్సెట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో తదుపరి ప్రక్రియపై అధికారులు దృష్టిసారించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు, మాస్టర్ ప్రశ్నపత్రాలను జేఎన్టీయూ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించిన పరీక్షల ప్రాథమిక కీని వెబ్సైట్లో పెట్టారు. విద్యార్థులు ఈ నెల 13న ఉదయం 11:30 గంటల్లోపు అభ్యంతరాలు తెలుపవచ్చు. ఇక ఇంజినీరింగ్ విభాగం ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లు, మాస్టర్ ప్రశ్నపత్రాలను మంగళవారం విడుదల చేస్తారు. ఈ నెల 14న ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాలు తెలుపవచ్చు.