SSC Exam Preparation | పదో తరగతి విద్యార్థులకు మార్చి, ఏప్రిల్ నెలలు ‘పరీక్షా’ కాలం. ముఖ్యంగా చాలా మందిలో తీవ్ర ఆందోళన, ఒత్తిడి నెలకొనే అవకాశం ఉంటుంది. ‘బాగా చదవాలి.. రాయాలి’, మంచి మార్కులు సాధించాలనే ఆలోచన నిద్రను కూడా దూరం చేస్తుంది. ఈ నేపథ్యంలో వారికి మనోనిబ్బరం కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే ఉంటుంది. ఉత్కంఠ, ఉద్వేగాలకు లోనుకాకుండా అవగాహన కల్పిస్తే, ఈ సమయాన్ని సులువుగా దాటే వీలుంటుంది. కాగా, ఏప్రిల్ 3 నుంచి 11వ తేదీ వరకు టెన్త్ వార్షిక పరీక్షలు జరగనుండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 36, 690 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఇచ్చోడ, ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 11 వరకు టెన్త్ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. అంటే పరీక్షల ప్రారంభానికి కేవలం సుమారు నెలరోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలు కలిపి 958 ఉండగా, ఇందులో 36,690 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ విద్యా సంవత్సరం ఆరు పేపర్లుగా మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. కాగా, పరీక్షల సమయం రావడంతో విద్యార్థుల్లో ఒత్తిడి నెలకొనే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు చదివేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సబ్జెక్టుల వారీగా పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి. అనే అంశాలపై విద్యారంగ నిపుణులు ఇచ్చిన సూచనలు ఇవే..
సైన్స్ పేపర్లోనే పార్ట్-బీగా ఉండే జీవశాస్త్రంలో రాణించేందుకు అవగాహన స్వీయ విశ్లేషణ నైపుణ్యాలను పెంచుకోవాలి. పుస్తకాల్లోని ఆయా అంశాలకు సంబంధించి ఫ్లో చార్ట్లు, బ్లాక్ డయాగ్రమ్స్లను సొంతంగా రూపొందించుకోవాలి. విశ్లేషణాత్మక, తులనాత్మక ఆధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నేర్చుకున్న అంశాలను వాస్తవ పరిస్థితులతో ఆన్వయించే విధంగా చదవాలి. ప్రయోగాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందడం ఎంతో మేలు చేస్తుంది. ఆయా అంశాలకు సంబంధించి చాప్టర్లో పేర్కొన్న ఆభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, బేధాలు తెలుసుకుంటూ చదవాలి. డయాగ్రమ్స్ విషయంలో భాగాలను గుర్తించడమే కాకుండా.. వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి. జీవ శాస్త్రంలో పోషణ శాసక్రీయ, ప్రసరణ విసర్ణన, నియంత్ర సమన్వయం, ప్రత్యుత్పతి పాఠాలలను గుర్తుంచుకోవాలి. జీవ శాస్త్రంలో బొమ్మ గీసి, వివరణ రాయడం ముఖ్యం. విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
– వెడ్మ విజయ్ ప్రకాశ్, జీవశాస్త్ర నిపుణుడు, ఆదర్శ ఆశ్రమోన్నత పాఠశాల రాయిగూడ, సిరికొండ మండలం
ఈ సబ్జెక్ట్లో మంచి మార్కులు పొందాలంటే.. సమకాలీన అంశాలపైనా అవగాహన ఏర్పర్చుకోవాలి. పాఠ్య పుస్తకంలోని ఏదైనా ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించి మన నిజజీవితంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చుకుంటూ చదవాలి. సమకాలీన అంశాల విషయంలో ప్రతిస్పందన, ప్రశ్నించడం, ప్రశంస, అభినందనలపై సాధన చేయడం ఎంతో అవసరం. అవగాహనకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి.. సొంత పరిజ్ఞానంతో రాసే నైపుణ్యం పెంచుకోవాలి. జాగ్రఫీ, ఎకనామిక్స్లో భారతదేశం-భౌగోళిక స్వరూపం, శీతోష్టస్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తి-ఆదాయం, సుస్థిరాభివృద్ధి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. హిస్టరీలో రెండు ప్రపంచ యుద్దాల సమయంలో ప్రపంచం, సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. భారత జాతీయోద్యమ చరిత్రను ప్రత్యేక దృష్టితో చదవాలి. సివిక్స్కు సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏఏ దేశాల రాజ్యాంగాల నుంచి అనుసరించారు. తదితర కోణాల్లో చదవాలి. ప్రపంచ పటంలో దేశాలు,రాజధానులను, గుర్తించేలను ప్రశ్నలు వస్తాయి. తొందరపడి తప్పులు చేయవద్దు
– అంగ శ్రీనివాస్, జడ్పీఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర నిపుణుడు, సిరికొండ
సైన్స్ సబ్జెక్ట్లో పార్ట్-ఏ ఫిజికల్ సైన్స్ (పీఎస్)లో మంచి మార్కులు సాధించాలంటే.. అప్లికేషన్ ఆప్రో చ్తో చదవడం ఎంతో ముఖ్యం. ఆయా చాప్టర్లకు సంబంధించిన అంశాలను నిజ జీవిత సంఘ టనతో అన్వయించుకుంటూ ప్రిపరేషన్ సాగిస్తే.. విషయ పరిజ్ఞానం మరింత పెంపొందించుకో వచ్చు. విషయ అవగాహనతోపాటు, ప్రశ్నించడం పరికల్పన చేయడం, ప్రయోగాలు-క్షేత్ర పర్యటనలు, సమాచార నైపుణ్యాలు-ప్రాజెక్ట్ పనులు పటాలు, వాటి ద్వారా భావ ప్రసావం వంటి వాటిపైనా కృషి చేయాలి. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలపై పట్టు సాధించాలి. మూలకాల ధర్మాలు-వర్గీకరణ, రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల లఘు, అతి స్వల్ప, బహుశైచ్ఛిక ప్రశ్నలకు సులువుగా సమాధానాలిచ్చే పట్టు లభిస్తుంది. ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభించి.. మంచి మార్కులు సొంతమవుతాయి.
కోవ లక్ష్మి, భౌతిక శాస్త్రం నిపుణురాలు,ఆశ్రమోన్నత బాలిక పాఠశాల మోడిగూడ,మ.ఇచ్చోడ
సహజంగా పరీక్ష అనగానే విద్యార్థుల్లో ఏదో తెలియని భయం ఉంటుంది. ఇందులో భాగంగా మొదటి రోజు కొంత టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్గా ఉండే తెలుగు పేపర్లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు.. ముందుగా పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. వాటిని పునశ్చరణ చేసుకోవాలి. పాఠాన్ని కేవలం చదవడంతో సరిపెట్ట కుండా.. సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. వ్యాసా ల పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యం. ఈ విషయంలో సొంతంగా ఆలోచి స్తూ చదవాలి. ఉపవాచకానికి సంబంధించి ఇతివృత్తం. ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తన శైలి తదితర అంశాల ద్వారా ఇచ్చే సందేశాన్ని తెలుసుకో వాలి. వ్యాకరణంలో మంచిగా ప్రతిభ చూపాలంటే.. సంధులు, సమాసాలు, సంయు క్తార్థాలు, ఉత్పత్యర్థాలు, జాతీయాలు బాగా చదవాలి. ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.
– బొడ్డు రామేశ్వర్,జడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు విషయ నిపుణులు,కుచ్చలపూర్
హిందీ పరీక్షలో మొదట ప్రశ్న పత్రాన్ని చదవడానికి కొంత సమయం తీసుకోవాలి. బాగా తెలిసిన ప్రశ్నలకు జవాబులను ముందుగా రాయాలి. హిందీలోని ముఖ్యమైన పాఠాలు మీరా బాయి కా పద్, బాషాకీ బాత్ విలోమ్, పునరావృతి శబ్ధ్, తతృమ్ శబ్ధ్, ఉప స్వర్గ్, చదవాలి, ప్రశ్నలకు సక్రమంగా జవాబులు రాస్తే వచ్చే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. పాఠ్య పుస్తకాన్ని,రాసుకున్న నోట్స్ను ఆర్థం చేసుకోని చదవాలి, చదివిన అంశాలను తిరిగి మననం చేసుకోవాలి. పరీక్షలకు చివరి సమయంలో కొత్త విషయాలను, వేరే ఇతర మెటీరియల్ను చదవద్దు. ముందు నుంచి ఉన్న వాటినే అనుసరించాలి. పాఠం పేరు, కవి, రచయిత పేరు,ఆ పాఠంలోని ముఖ్యాంశాలను తెలియజేసే పట్టికలను పద్య భాగం, గద్య భాగం,ఉపవాచకానికి వేర్వేరుగా తయారు చేసుకోవాలి. అందంగా గుండ్రటి అక్షరాలతో పాటు కొట్టి వేతలు లేకుండా పద్యాలను విడగొట్టకుండా రాయాలి. వ్యాకరణంపై మంచి అవగాహన ఉండాలి బహుళైచ్చిక ప్రశ్నలలో పూర్తి స్థాయి మార్కులు సాధించవచ్చు. విద్యార్థులు ఈ సూచనలు పాటిస్తే పది పాయింట్లు పొందవచ్చు.
– పీ. భాస్కర్, జడ్పీ ఉన్నత పాఠశాల, హిందీ పండిత్ సిరికొండ
ఇంగ్లిష్ పరీక్షంటే తెలుగు మీడియం విద్యార్థులకు కొంత తెలియని భయం ఉంటుంది. కానీ ప్రణాళిక ప్రకారం చదివితే పది గ్రేడ్ పాయింట్లు సాధించవచ్చు. మొదటగా అక్షర దోషాలపై దృష్టి పెట్టాలి. ఇంగ్లిష్ పేపర్లో మంచి మార్కులు పొందేందుకు వెర్బల్, నాన్ వెర్బల్ అంశాలు బాగా చదవాలి. ఉదాహరణకు లేబుల్స్, బార్ డయాగ్రమ్స్పై చార్ట్స్ తదితర అంశాలను అధ్యయనం చేయాలి. సొంతంగా విశ్లేషించేలా నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం పాత ప్రశ్న పత్రాల సమాధానాలను పరిశీలించడం కూడా మేలు చేస్తుంది. ప్రతి పాఠం చివరలో ఉండే కాంప్రహెన్సివ్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా ప్రతి పాఠానికీ సంబంధించి సారాంశాన్ని గ్రహించి సొంతంగా రాసుకునే అలవాటు చేసుకోవాలి. పోయెట్రీ ప్రశ్నల్లో మంచి మార్కుల సాధన కోసం సదరు పద్యంలో ముఖ్య పదాలు, యాంటానిమ్స్, సినానిమ్స్పై దృష్టి సారించాలి. వీటితోపాటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, వ్యాసాలు, ఈ విషయంలో చదవడంతోపాటు ప్రాక్టీస్ కూడా చేస్తే మెరుగైన మార్కులు పొందేందుకు మరింత ఆస్కారం లభిస్తుంది. అదేవిధంగా అపరిచిత గద్యం (అన్ నౌన్ ప్యాసెజేస్) సారాంశాన్ని గ్రహించేలా చదవాలి. లెటర్ రైటింగ్కు సంబంధించి పంక్చుయేషన్స్, బాడీ ఆఫ్ ది లెటర్ వంటి అంశాలపై పట్టు ఎంతో అవసరం. దీంతో 24 మార్కులు వచ్చే అవకాశం ఉంది.
– ఆర్టీవీ ప్రసాద్, ఇంగ్లిష్ విషయ నిపుణులు, జడ్పీ ఉన్నత పాఠశాల బజార్హత్నూర్
పదో తరగతి స్థాయిలో విద్యార్థులు క్లిష్టంగా భావించే సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, సిలబస్ అంశాలను పూర్తిగా అధ్యయనం చేస్తూ.. ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ సబ్జెక్ట్పై పట్టు సాధించొచ్చు. సంఖ్యా వ్యవస్థ, భీజగణితం, నిరూపక రేఖాగణితం, రేఖా గణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సంభావ్యత, సాంఖ్యక శాస్త్రంపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంతోపాటు కారణాల నిరూపణ, వ్యక్తీకరణ, ఒక సమస్యను ఇతర అంశాలతో అనుసంధానం చేయడం వంటి నైపుణ్యాలు పొందాలి. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే.. రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. పాఠ్యపుస్తకంలో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. గ్రాఫ్లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కొనుగోనేందుకు ప్రాక్టీస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాల్లోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు, సంభావ్యత సాధన చేయాలి. దీంతో పాటు ముందుగా గణతం అంటే భయం వీడాలి.
– రాథోడ్ రవీందర్, గణిత నిపుణులు, ఆశ్రమోన్నత పాఠశాల రిమ్మ, సిరికొండ